ఎన్నికలకు సిద్దమా..? : బీజేపీకి మంత్రి తలసాని సవాల్
Is BJP at Centre ready for fresh polls, asks Talasani. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదివారం నిప్పులు చెరిగారు.
By Medi Samrat Published on 15 May 2022 10:49 AM GMT
కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదివారం నిప్పులు చెరిగారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నందున నోటికి వచ్చినట్లు మాట్లాడడం సరికాదని ఆరోపించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని రద్దు చేసి.. దేశం అంతటా ఎన్నికలకు వెళుతుందా అని సవాల్ విసిరారు. కేంద్ర హోంమంత్రి పదవిలో ఉంటూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్పై అమిత్ షా మాట్లాడడం సరికాదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రం గుజరాత్లో 2 బీహెచ్కే ఇళ్లను ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు.
తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా ఉన్నారని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు 2బీహెచ్కే మంజూరు చేసి.. హామీలను నెరవేర్చిందన్నారు. సీఎం కేసీఆర్ భవిష్యత్ ప్రణాళికలతో రాష్ట్రంలోని అన్ని రంగాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేయగలిగారని తలసాని అన్నారు. అర్హులైన లబ్ధిదారులకు 2బీహెచ్కే ఇళ్లను మంజూరు చేస్తామని, ఎవరూ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి టీఆర్ఎస్ ప్రభుత్వం తాగునీరు అందిస్తోందన్నారు.
అంతకుముందు శనివారం హైదరాబాద్ తుక్కుగూడలో జరిగిన బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రసంగాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) "అబద్ధాల మూట" అని అభివర్ణించింది. అమిత్ షా పచ్చి అబద్ధాలు మాట్లాడారని ఆర్థిక మంత్రి హరీశ్రావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఇ.దయాకర్రావు, రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆదివారం అన్నారు.