అత్యంత శక్తిమంతుల జాబితా.. సీఎం రేవంత్ స్థానం ఎంతంటే..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత శక్తిమంతుల జాబితాలో స్థానం దక్కించుకున్నారు.
By Medi Samrat
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత శక్తిమంతుల జాబితాలో స్థానం దక్కించుకున్నారు. ద ఇండియన్ ఎక్స్ప్రెస్ 2025 సంవత్సరానికి సంబంధించి దేశంలోని వివిధ రంగాల్లో అత్యధిక శక్తిమంతులైన 100 మంది ప్రముఖులతో జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 28వ స్థానం దక్కించుకున్నారు. 2024 సంవత్సరపు జాబితాలో 39 స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఏడాది కాలంలో 11 స్థానాలు ఎగబాకి 28వ స్థానానికి చేరుకోవడం విశేషం. దేశంలో రాజకీయ, వ్యాపార, క్రీడా, వినోద రంగాల్లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులు ఈ జాబితాలో ఉన్నారు.
తెలంగాణ రాష్ట్ర పాలనలో తీసుకువచ్చిన మార్పులు, వ్యూహాత్మక రాజకీయ కార్యకలాపాలు, దేశవ్యాప్తంగా ఇండియా కూటమిలో పోషిస్తున్న ప్రముఖమైన పాత్రతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ గుర్తింపు లభించింది. తనదైన దూకుడుతో భారత రాజకీయాల్లో ఆయన చూపుతున్న ప్రభావం, నాయకత్వ లక్షణాలతో ఆయన ర్యాంకు మెరుగుపడింది. ఒక ప్రాంతీయ నాయకుడినే కాకుండా దేశంలోనే అత్యంత శక్తిమంతమైన, చురుకైన ముఖ్యమంత్రుల్లో ఒకరిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిర్భవించారు.
శక్తిమంతులై వంద మంది జాబితాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మొదటి 10 స్థానాల్లో ఉన్నారు. కేంద్ర మంత్రులు ఎస్. జైశంకర్, రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, అశ్విన్ వైష్ణవ్, బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎం.కె. స్టాలిన్, మమతా బెనర్జీ, సిద్ధరామయ్య వంటి నేతలు తొలి 25 మందిలో ఉన్నారు.