హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మాధాపూర్ ప్రాంతంలోని జూబ్లీ ఎన్క్లేవ్లో పార్కులతో పాటు రహదారుల ఆక్రమణలను హైడ్రా తొలగించింది. 22.20 ఎకరాలలో దాదాపు 100 ప్లాట్లతో అనుమతి పొందిన ఈ లే ఔట్లో 4 పార్కులుండగా 2 కబ్జా(దాదాపు 8 వేల 500 గజాలు)కు గురయ్యాయి. అలాగే 5 వేల గజాల మేర రోడ్డు కూడా కబ్జా అయ్యింది. వీటికి తోడు.. దాదాపు 300ల గజాల ప్రభుత్వ స్థలంలో అక్రమంగా వెలిసిన హోటల్ షెడ్డును కూడా హైడ్రా తొలగించింది. మొత్తం 16000 గజాల స్థలాన్ని హైడ్రా కాపాడింది. దీని విలువ దాదాపు రూ. 400 కోట్ల వరకు ఉంటుంది.
1995లో అనుమతి పొందిన ఈ లే ఔట్ ను 2006లో ప్రభుత్వం రెగ్యులరైజ్ కూడా చేసింది. ఈ లే ఔట్ ప్రకారం GHMCకి గిఫ్ట్ డీడ్ చేసిన పార్కులను జైహింద్రెడ్డి అనే వ్యక్తి కబ్జా చేశారంటూ జూబ్లీ ఎన్క్లేవ్ లే ఔట్ ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై క్షేత్రస్థాయిలో విచారించిన హైడ్రా అధికారులు కబ్జాలు వాస్తవమే అని నిర్ధారించుకున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు వాటిని గురువారం తొలగించారు. హైడ్రా ఏసిపి శ్రీకాంత్, ఇన్స్పెక్టర్లు రాజశేఖర్, బాలగోపాల్ నేతృత్వంలో కూల్చివేతలు చేపట్టారు. కబ్జాకు పాల్పడ్డవారిపై కేసులు పెడుతున్నట్టు హైడ్రా అధికారులు తెలిపారు.