వరద కష్టాలపై హైడ్రా దృష్టి..ఆ చెరువుకు నీటి మళ్లింపుపై రీసెర్చ్
అమీర్పేట మెట్రో స్టేషన్, మైత్రివనం వద్ద వరద ఉధృతిని ఆపేదెలా అనే అంశంపై హైడ్రా దృష్టి పెట్టింది.
By Knakam Karthik
వరద కష్టాలపై హైడ్రా దృష్టి..ఆ చెరువుకు నీటి మళ్లింపుపై రీసెర్చ్
హైదరాబాద్: అమీర్పేట మెట్రో స్టేషన్, మైత్రివనం వద్ద వరద ఉధృతిని ఆపేదెలా అనే అంశంపై హైడ్రా దృష్టి పెట్టింది. సీఎం రేవంత్రెడ్డి సూచనల మేరకు శాశ్వత పరిష్కారానికి ప్రత్యేకంగా ట్రంకు లైను ఏర్పాటు చేయడంతో పాటు.. తాత్కాలిక ఉపశమనానికి ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశంపై హైడ్రా కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ అమీర్పేట మైత్రివనం పరిసరాల్లో వరద కాలువలకు ఉన్న ఆటంకాలను పరిశీలించారు. అనంతరం కృష్ణాకాంత్ పార్కులోని చెరువును, వరద కాలువలను తనిఖీ చేశారు. జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 10, వెంకటగిరి, రహ్మత్నగర్, యూసుఫ్గూడ ప్రాంతాల నుంచి కృష్ణాకాంత్ పార్కు మీదుగా పారే వరద కాలువలను పరిశీలించారు. కృష్ణాకాంత్ పార్కులో ఉన్న చెరువును కూడా తనిఖీ చేశారు. పై నుంచి భారీఎత్తున వస్తున్న వరదను కృష్ణాకాంత్ పార్కులోని చెరువుకు మళ్లిస్తే చాలావరకు వరద ఉధృతిని కట్టడి చేయవచ్చని హైడ్రా కమిషనర్ అభిప్రాయపడ్డారు.
చెరువుకు మళ్లించి వరద కట్టడి..
పై ప్రాంతాల నుంచి వచ్చే వరదను కృష్ణాకాంత్ పార్కులో ఉన్న చెరువుకు మళ్లించి కొంతమేర ఉధృతిని తగ్గించవచ్చు అనే అంశంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. 7 ఎకరాల మేర పార్కులో చెరువుంది. ఆ చెరువును 12 ఎకరాల వరకూ విస్తరించడానికి వీలుంది. ఇలా 120 మిలియన్ లీటర్ల నీటిని కొన్ని గంటలు హోల్డ్ చేసి.. వర్షం తగ్గిన తర్వాత కిందకు వదిలితే వరద ఉధృతిని కొంతవరకు తగ్గుతుందని భావించారు. ప్రస్తుతం కృష్ణాకాంత్ పార్కులోని చెరువులోకి నీరు వెళ్లకుండా.. నేరుగా మధురానగర్ మీదుగా అమీర్పేటకు వచ్చి చేరడంతో మెట్రో స్టేషన్ కింద భారీ మొత్తంలో వరద నీరు నిలిచిపోతోంది. కృష్ణాకాంత్ పార్కులోని చెరువు నుంచి మధురానగర్ మీదుగా అమీర్పేట మెట్రో స్టేషన్ వరకూ 1100 మీటర్ల బాక్సు డ్రైన్ ఉంది. అమీర్పేట వద్ద భూమి సమాంతరంగా ఉండడంతో పై నుంచి భారీమొత్తంలో వచ్చిన వరద కిందకు వెళ్లడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని హైడ్రా అధికారులు కమిషనర్కు తెలిపారు. దీనికి తోడు పై నుంచి వచ్చిన చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు కూడా వరద ప్రవాహానికి ఆటంకంగా మారుతున్నాయని పేర్కొన్నారు.