Hyderabad: గచ్చిబౌలి స్టేడియంలో డబ్ల్యూడబ్ల్యూఈ.. ఫస్ట్‌ టైమ్‌

హైదరాబాద్ నగరంలో తొలిసారిగా సెప్టెంబర్ 8న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో డబ్య్లుడబ్ల్యుఈ ఈవెంట్‌ని నిర్వహించనున్నారు.

By అంజి  Published on  14 Aug 2023 1:08 AM GMT
Hyderabad, Srinivas Goud, Telangana, WWE

Hyderabad: గచ్చిబౌలి స్టేడియంలో డబ్ల్యూడబ్ల్యూఈ.. ఫస్ట్‌ టైమ్‌

హైదరాబాద్ నగరంలోని ప్రో రెజ్లింగ్ అభిమానులకు పండగలాంటి వార్త. సెప్టెంబర్ 8న వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ) ఈవెంట్‌ జరగనుంది. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియం “WWE సూపర్‌స్టార్ స్పెక్టాకిల్” ఈవెంట్‌ను నిర్వహిస్తుందని క్రీడలు, యువజన సేవల మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ట్విట్టర్‌లో తెలిపారు. అంతకుముందు ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను మంత్రి విడుదల చేశారు.

ఈ ఈవెంట్‌లో అంతర్జాతీయంగా పేరున్న 28 మంది డబ్య్లుడబ్ల్యుఈ క్రీడాకారులు పాల్గొంటారని మంత్రి తెలిపారు. ప్రపంచ హెవీవెయిట్ ఛాంపియన్ సేత్ 'ఫ్రీకిన్' రోలిన్స్, మహిళల ప్రపంచ ఛాంపియన్ రియా రిప్లే, వివాదరహిత డబ్ల్యూడబ్ల్యూఈ ట్యాగ్ టీమ్ ఛాంపియన్‌లు సమీ జైన్, కెవిన్ ఓవెన్స్‌లతో సహా పెద్ద డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్‌స్టార్‌లు ఈ ఈవెంట్‌లో పాల్గొంటారు. ఇతర డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్‌స్టార్లు, జిందర్ మహల్, వీర్ సంగ, డ్రూ మింటైర్, బెక్కీ లించ్, నటాల్యా, మాట్ రిడ్డు, లుడ్విగ్ కైజర్ కూడా పోరాడతారు. ఈవెంట్ కోసం టిక్కెట్లు www.bookmyshow.com లో అందుబాటులో ఉన్నాయి.

బుక్‌ మై షో లైవ్‌ ప్రొడక్షన్‌లో భాగంగా దేశంలోనే ప్రతిష్ఠాత్మకంగా హైదరాబాద్‌లో తొలిసారిగా డబ్య్లుడబ్ల్యుఈ సూపర్ స్టార్ స్పెక్టాకిల్ క్రీడలను నిర్వహించబోతున్నారు. దేశంలోనే రెండోసారిగా అత్యంత ప్రతిష్టాత్మకంగా డబ్య్లుడబ్ల్యుఈ సూపర్ స్టార్ స్పెక్టాకిల్ క్రీడలు నిర్వహిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. క్రీడాకారులు డబ్య్లుడబ్ల్యుఈ సూపర్ స్టార్స్ క్రీడల్లో వారి అసమానమైన నైపుణ్యాలు, తమ పరాక్రమాన్ని ప్రదర్శించనున్నట్లు తెలిపారు. మరింత సమాచారం కోసం www.wwe.comను సంప్రదించవచ్చని మంత్రి తెలియజేశారు.

Next Story