గుడ్‌న్యూస్..మెట్రో రైల్ సెకండ్ ఫేజ్ (B) ప్రాజెక్టుకు ప్రభుత్వం అనుమతి

హైదరాబాద్​ మెట్రో రైలు 2-బీ నిర్మాణానికి పరిపాలన అనుమతులిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.

By Knakam Karthik
Published on : 17 Jun 2025 11:33 AM IST

Hyderabad News, Congress Government, Hyderabad Metro Rail Phase Two B

గుడ్‌న్యూస్..మెట్రో రైల్ సెకండ్ ఫేజ్ (B) ప్రాజెక్టుకు ప్రభుత్వం అనుమతి

హైదరాబాద్ వాసులను ట్రాఫిక్ కష్టాల నుంచి మెట్రో రైలు ఎంతో కొంత ఉపశమనం కలిగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హైదరాబాద్​ మెట్రో రైలు 2-బీ నిర్మాణానికి పరిపాలన అనుమతులిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. రూ.19,579 కోట్లతో 81.6 కి.మీ మేర మూడు కారిడార్లకు అనుమతులిచ్చింది. కారిడార్‌‌–1లో భాగంగా శంషాబాద్ నుంచి ఫ్యూచర్‌ సిటీ వరకు 39.6 కి.మీ మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు. కారిడార్‌‌–2లో జూబ్లీ బస్‌స్టేషన్‌ నుంచి మేడ్చల్‌ వరకు 24.5 కి.మీ మేర మెట్రోను విస్తరించనున్నారు. కారిడార్‌-3లో భాగంగా జూబ్లీ బస్‌స్టేషన్‌ నుంచి శామీర్‌పేట వరకు 22 కి.మీ మేర మెట్రో నిర్మించనున్నారు.

హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు మెట్రో లిమిటెడ్‌ ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్‌ వెంచర్‌గా ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టనున్నాయి. అయితే మెట్రో 2-బి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.5,874 కోట్లు కాగా, కేంద్రం వాటా రూ.3,524 కోట్లు. రుణాల ద్వారా రూ.9,398 కోట్లు, ప్రైవేటు భాగస్వామ్యంతో రూ.783 కోట్ల వ్యయం చేయనున్నారు. దీనిలో కేంద్ర ప్రభుత్వ వాటా 18 శాతం, తెలంగాణ ప్రభుత్వ వాటా 30 శాతం, జైకా, ఏడీబీ, ఎన్డీబీ నుంచి రుణం వాటా 48 శాతం, పీపీపీ కాంపోనెంట్‌ 4 శాతంగా పేర్కొన్నారు. త్వరలో పరిపాలన అనుమతిని డీపీఆర్‌కు జత చేసి కేంద్రానికి పంపనున్నారు.

మరో వైపు పాతబస్తీ మెట్రో అనుసంధాన ప్రాజెక్టుకు ప్రభుత్వం రూ.125 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు సోమవారం ప్రభుత్వ కార్యదర్శి ఇలంబర్తి ఉత్తర్వులు జారీ చేశారు. 2025-26 బడ్జెట్‌లో పాత బస్తీ మెట్రోకు రూ.500 కోట్లు కేటాయించారు. దీనిలో నుంచి రూ.125 కోట్లను తాజాగా విడుదల చేశారు.

Next Story