మొంథా తుపాన్..తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు, ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు భారీ వర్షాలు కురుస్తున్నాయి.
By - Knakam Karthik |
మొంథా తుపాన్..తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు, ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాలకు రెడ్ అలర్ట్ చేసింది. మరో 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కాగా ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ను వాతావరణశాఖ జారీ చేసింది. 14 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
ముఖ్యంగా ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, సిద్దిపేట, హనుమకొండ, వరంగల్, జనగామ, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్, సూర్యాపేట, ఖమ్మం, నాగర్కర్నూల్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో 80 నుంచి 180 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు.
మరో వైపు హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచే కుండపోతగా వర్షం కురుస్తోంది. సాయంత్రం వరకు అడపాదడపా ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మోస్తరు వర్షాలతో పాటు బలమైన గాలులు వీస్తాయని తెలిపింది. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 1 వరకు ఉదయం పూట పొగమంచు లేదా మబ్బులతో కూడిన వాతావరణం ఉంటుందని వెల్లడించింది. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాలు చేసేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.