వడగాలులపై రాష్ట్రంలో హీట్వేవ్ యాక్షన్ ప్లాన్ రిలీజ్
హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ -2025ను మంత్ పొంగులేటి విడుదల చేశారు.
By Knakam Karthik
వడగాలులపై రాష్ట్రంలో హీట్వేవ్ యాక్షన్ ప్లాన్ రిలీజ్
రాష్ట్రంలో పెరుగుతున్న ఎండలు, వడగాలుల నుంచి ప్రజలకు రక్షించాల్సిన బాధ్యత తమపై ఉందని తెలంగాణ రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ ఏడాదిలో ఎండలు, వడగాలులు అధికంగా వీచే అవకాశం ఉందని.. జూన్ వరకు కూడా అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని.. ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై 12 సంబంధిత శాఖలతో మంత్రి పొంగులేటి శుక్రవారం సచివాలయంలో తన కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆమేరకు సంబంధిత శాఖలు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ, ఇండియన్ మెట్రాలాజికల్ శాఖ కలిసి సమగ్ర తెలంగాణ స్టేట్ హీట్వేవ్ యాక్షన్ ప్లాన్ (HAP)-2025 ను రూపొందించాయని ఇందులో భాగంగా . ప్రతి జిల్లాకు ఒక నోడల్ అధికారిని నియమించారని తెలిపారు. ఈ సందర్బంగా హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ -2025ను మంత్ పొంగులేటి విడుదల చేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పుల దృష్ట్యా చలివేంద్రాలలో త్రాగునీరుతోపాటు ఓఆర్ఎస్, మజ్జిగ ప్యాకెట్ల సరఫరా చేయాలి. సీఎస్ఆర్ కింద వివిధ కంపెనీలు వీటిని సరఫరా చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం,మహబూబ్నగర్, నిజామాబాద్, కొత్తగూడెం, మెదక్, కరీంనగర్ తదితర పట్టణ ప్రాంతాల్లో ప్రధానంగా దృష్టిసారించాలని సూచించారు. తెలంగాణలో 612 మండలాల్లో 588 మండలాలను వడగాలుల ప్రభావిత ప్రాంతాలుగా వర్గీకరించామని తెలంగాణ రాష్ట్రం గతనెల 15న హీట్వేవ్ను స్టేట్ స్పెసిఫిక్ డిజాస్టర్గా నోటిఫై చేశామని తెలిపారు. మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియోను రూ. 50 వేల నుంచి రూ.4 లక్షలకు పెంచినట్లు తెలిపారు.
వడగాలుల ప్రభావం సామాన్యప్రజలపై పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. అనుకోని పరిస్ధితులలో ఎవరైనా చనిపోతే మానవతా దృక్ఫధంతో వ్యవహరించి తక్షణం ఎక్స్ గ్రేషియో అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎండలకు సంబంధించిన సమాచారం, అధిక ఉష్ణోగ్రతల వేళ ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలు, కూల్ వార్డుల ఏర్పాటు, ఆసుపత్రులలో ఫైర్ సేఫ్టీ ఆడిట్ నిర్వహణ వంటి అంశాలపై చర్యలు చేపట్టాలని ప్రజా ఆరోగ్య కేంద్రాలు, ఆస్పత్రులలో ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని , ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖను మంత్రి పొంగులేటి ఆదేశించారు.