10వ తరగతి విద్యార్థులను స్మార్ట్‌ఫోన్‌లు, టీవీల‌కు దూరంగా ఉంచండి

Harish Rao asks parents to keep Class 10 students away from phone, TV. బోర్డు పరీక్షలు పూర్తయ్యే వరకు 10వ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్ల‌ల‌ను స్మార్ట్‌ఫోన్‌లు

By Medi Samrat  Published on  25 Feb 2023 3:15 PM GMT
10వ తరగతి విద్యార్థులను స్మార్ట్‌ఫోన్‌లు, టీవీల‌కు దూరంగా ఉంచండి

బోర్డు పరీక్షలు పూర్తయ్యే వరకు 10వ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్ల‌ల‌ను స్మార్ట్‌ఫోన్‌లు, టెలివిజన్‌లకు దూరంగా ఉంచాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. తల్లిదండ్రులు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలు, డీఈవోలు తదితర అధికారులతో శనివారం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో పిల్లలను ప్రతిరోజు ఉదయం 5 గంటలకు నిద్రలేపి బోర్డు పరీక్షలకు సన్నద్ధం చేయించాల‌ని మంత్రి సూచించారు.

10 జీపీఏ సాధించిన విద్యార్థులకు రూ.10,000 కేస్ ప్రైజ్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ ఏడాది 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో సిద్ధిపేట‌ జిల్లా మళ్లీ అగ్రస్థానంలో నిలవాలని అన్నారు. గత ఏడాది 10వ తరగతి పరీక్షల్లో సిద్దిపేట 97 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలవగా, 2020-21లో 98 శాతం ఉత్తీర్ణతతో జిల్లా ద్వితీయ స్థానంలో నిలిచిందన్నారు.

ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు జిల్లా యంత్రాంగం ఉచితంగా అల్పాహారం, సాయంత్రం స్నాక్స్ అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. తల్లిదండ్రులకు మార్గనిర్దేశం చేసేందుకు 10,000 మందికి పైగా 10వ తరగతి చదువుతున్న తల్లిదండ్రులతో హరీష్ రావు టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. విద్యార్థుల కోసం డిజిటల్ మెటీరియల్‌ను అభివృద్ధి చేశామని, బోర్డ్ పరీక్షల్లో 100 శాతం ఫలితాలు సాధించిన పాఠశాలల ఉపాధ్యాయులకు కూడా రివార్డ్ చేస్తానని మంత్రి చెప్పారు.


Next Story