'తెలంగాణకు 9 కేంద్రీయ, 16 నవదోయ విద్యాలయాలు మంజూరు చేయండి'.. కేంద్రానికి సీఎం రేవంత్‌ విజ్ఞప్తి

హైదరాబాద్‌కు ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM) మంజూరు చేయాల‌ని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కి ముఖ్య‌మంత్రి రేవంత్‌ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు.

By -  అంజి
Published on : 17 Dec 2025 7:06 AM IST

Navadoya Vidyalayas,Telangana, CM Revanth ,Central Govt,Dharmendra Pradhan, IIM

'తెలంగాణకు 9 కేంద్రీయ, 16 నవదోయ విద్యాలయాలు మంజూరు చేయండి'.. కేంద్రానికి సీఎం రేవంత్‌ విజ్ఞప్తి

హైదరాబాద్‌కు ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM) మంజూరు చేయాల‌ని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కి ముఖ్య‌మంత్రి రేవంత్‌ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, ఏరో స్పేస్, డిఫెన్స్, లాజిస్టిక్స్, అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో ముందున్న హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటు చేయాల్సిన అవ‌సరం ఉంద‌ని తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి.. ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌తో పార్ల‌మెంట్‌లోని ఛాంబ‌ర్‌లో భేటీ అయ్యారు. దేశంలో 19 రాష్ట్రాల్లో, 1 కేంద్ర పాలిత ప్రాంతంలో కలిపి 21 ఐఐఎంలు ఉన్నాయ‌ని, తెలంగాణ రాష్ట్రంలోనూ ఐఐఎం ఏర్పాటు చేయాల‌ని కోరారు. ఐఐఎం ఏర్పాటుకు అవసరమైన 200 ఎకరాల భూమిని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రాంగణంలో గుర్తించిన విషయాన్ని తెలిపారు.

ఐఐఎం తరగతులు వెంట‌నే ప్రారంభించేందుకు ట్రాన్సిట్ క్యాంపస్ సిద్ధంగా ఉంద‌ని కూడా చెప్పారు. అందుకు అవసరమైన అనుమతులు వెంటనే మంజూరు చేయడంతో పాటు అవసరమైన వసతులు కల్ప‌న‌కు ప్రభుత్వం సిద్ధంగా ఉన్న‌ట్లు తెలిపారు. దేశంలోని అన్ని ప్రాంతాలకు రాకపోకలు సాగించేందుకు వీలుగా హైదరాబాద్ కు ఎయిర్, రైల్, రోడ్ కనెక్టివిటీ ఉంద‌ని, అనుకూల వాతావ‌ర‌ణం, భిన్న రంగాల ప్ర‌ముఖుల‌ను అంద‌జేసిన చ‌రిత్ర హైదరాబాద్‌కు ఉంద‌న్నారు. తెలంగాణలో పెరిగిన జిల్లాల సంఖ్యకు అనుగుణంగా నూత‌నంగా 9 కేంద్రీయ విద్యాలయాలు, 16 జవహర్ నవోదయ విద్యాలయాలను మంజూరు చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. పెరుగుతున్న పట్టణీకరణ, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటు అవసరం ఉంద‌ని చెప్పారు.

కొమురం భీం ఆసిఫాబాద్‌, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి, కామారెడ్డి, జోగులాంబ గ‌ద్వాల‌, నారాయ‌ణ‌పేట‌, నాగ‌ర్‌క‌ర్నూల్‌, సూర్యాపేట‌, వికారాబాద్‌, నిర్మ‌ల్ జిల్లాల్లో కేంద్రీయ విద్యాల‌యాలు, హ‌నుమ‌కొండ‌, జ‌న‌గాం, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి, జోగులాంబ గద్వాల‌, మ‌హ‌బూబాబాద్‌, మేడ్చ‌ల్ మ‌ల్కాజిగిరి, మెద‌క్‌, ములుగు, నారాయ‌ణ‌పేట‌, పెద్ద‌ప‌ల్లి, రాజ‌న్న సిరిసిల్ల‌, వికారాబాద్‌, వ‌న‌ప‌ర్తి, యాదాద్రి భువ‌న‌గిరి, నిర్మ‌ల్‌, ఆదిలాబాద్ జిల్లాలో జ‌వ‌హ‌ర్ న‌వోద‌య విద్యాల‌యాలు వెంట‌నే ఏర్పాటు చేయాల‌ని కోరారు. కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు అవసరమైన స్థలం, ఇతర వసతులు కల్పించడానికి తాము సిద్ధంగా తెలిపారు. ఈ స‌మావేశంలో ఎంపీలు అనిల్ కుమార్‌ యాదవ్‌, మల్లు రవి, చామల కిరణ్‌ కుమార్‌, ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌తినిధి జితేందర్‌ రెడ్డి పాల్గొన్నారు.

Next Story