హైదరాబాద్: డిగ్రీలో ఆన్లైన్ ప్రవేశాల కోసం నిర్వహించే దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ - తెలంగాణ) రిజిస్ట్రేషన్ల గడువును జూన్ 25 వరకు పొడిగించారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో విధించిన నేటితో ముగియడంతో విద్యార్థులు, డిగ్రీ కాలేజీల ప్రిన్సిపల్స్ అభ్యర్థనతో గడువు పెంచినట్టు ఉన్నత విద్యా మండలి వెల్లడించింది. విద్యార్థులు ఈ నెల 25లోగా రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని తెలిపింది. ఈ నెల 25 తర్వాత విద్యార్థులకు సీట్లు కేటాయించనున్నారు.
తాజా నిర్ణయంతో, ఇంకా దరఖాస్తు చేసుకోని విద్యార్థులకు మరో అవకాశం లభించినట్లయింది. గడువు పొడిగింపు నిర్ణయం పట్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దోస్త్ మొదటి విడత అడ్మిషన్ల ప్రక్రియలో 60వేల మందికి పైగా విద్యార్థులు సీట్లు దక్కించుకున్న విషయం తెలిసిందే. డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం 89,572 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారని ఇప్పటికే ఉన్నత విద్యామండలి తెలిపింది. తొలి విడతలో కామర్స్ కోర్సులోనే అత్యధికంగా 21,758 సీట్లు భర్తీ అయ్యాయి.