విద్యార్థులకు గుడ్‌న్యూస్.. తెలంగాణలో ఎంసెట్ ద‌ర‌ఖాస్తు గ‌డువు మళ్లీ పొడిగింపు

Good News For Eamcet Students. తెలంగాణలో ఎంసెట్ రాయాలనుకుంటున్న విద్యార్థులకు గుడ్ న్యూస్. ఎంసెట్ దరఖాస్తు గడువు

By Medi Samrat  Published on  17 Jun 2021 1:50 PM GMT
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. తెలంగాణలో ఎంసెట్ ద‌ర‌ఖాస్తు గ‌డువు మళ్లీ పొడిగింపు

తెలంగాణలో ఎంసెట్ రాయాలనుకుంటున్న విద్యార్థులకు గుడ్ న్యూస్. ఎంసెట్ దరఖాస్తు గడువు పెంచినట్లు ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ తెలిపారు. జూన్ 24 వరకు గడువు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఇప్పటి వరకు ఇంజనీరింగ్ కోసం 2 లక్షల 25 వేల 125 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని.. అగ్రికల్చర్ బీఎస్సీ కోసం 75 వేల 519 మంది దరఖాస్తు చేసుకున్నారని గోవర్ధన్ చెప్పుకొచ్చారు. ఎలాంటి అప‌రాధ రుసుం లేకుండా ఈ నెల 24 వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చని ఆయన చెప్పుకొచ్చారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా విద్యార్థుల విజ్ఞ‌ప్తి మేర‌కు ద‌ర‌ఖాస్తు గ‌డువును పొడిగించినట్లు గోవర్ధన్ వెల్లడించారు. ఈ పరీక్ష దరఖాస్తు గడువు మే 18న ముగియాల్సి ఉండగా జూన్ 24 వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

తెలంగాణ ఎంసెట్ పరీక్షను ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో జెఎన్‌టీయూ నిర్వహిస్తోంది. ఎంసెట్ పరీక్షలు జూలై 5 నుంచి 9 వరకు కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) మోడ్‌ ఆధారంగా నిర్వహించనున్నారు. పరీక్షలు మొత్తం 9 సెషన్లలో నిర్వహించనున్నారు. అగ్రికల్చర్‌ వారికి 3, ఇంజినీరింగ్‌ వారికి 5 సెషన్లు, మరో సెషన్‌ను అవసరాన్ని బట్టి నిర్వహించనున్నట్లు జెఎన్‌టీయూ వెల్లడించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ మరలా తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఆగస్టు చివరి వారంలో ఫలితాలు ప్రకటించే అవకాశాలు ఉండగా.. సెప్టెంబర్ 15 నాటికి అడ్మిషన్స్ పూర్తిగా చేపట్టాలని భావిస్తున్నారు.


Next Story