ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి తెలంగాణలో ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పదవికి, పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు కీలక నేత గట్టు శ్రీకాంత్రెడ్డి సంచలన ప్రకటన చేశారు. తన రాజీనామా లేఖను ఏపీ సీఎం వైఎస్ జగన్కు పంపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏపీ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా.. తెలంగాణలో వైసీపీని విస్తరించే పరిస్థితి లేకపోవడంతో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు గట్టు ప్రకటించారు.
అయితే.. వైఎస్ జగన్ భవిష్యత్లో ఇంకా గొప్ప స్థానాలు అధిరోహించాలని కోరుకుంటున్నట్లుగా శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఒక సామాన్య కార్యకర్తను రాష్ట్ర అధ్యక్షుడుగా నియమించిన గొప్ప వ్యక్తి జగన్ అంటూ కొనియాడారు. ఇవాళ తన జీవితంలో దుర్దినం అని భావోద్వేగానికి లోనయ్యారు. తనకు 2007 నుంచి జగన్తో పరిచయం ఉందని.. అప్పుడు కాంగ్రెస్లో చేరిన నాటి నుంచి నేటి వరకు ఆయనపై ఉన్న నమ్మకంతో.. అతని వెంటే నడిచానని చెప్పుకొచ్చారు. త్వరలోనే తాను ఓ జాతీయ పార్టీలో చేరనున్నానని.. ఆ పార్టీ తరఫునే హుజుర్ నగర్ ఎమ్మెల్యేగా పోటీకి దిగుతానని తెలిపారు.