నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం వల్లాల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో స్వాతంత్ర్య ఉద్యమకారుల జ్ఞాపకార్థం స్మారక స్థూప నిర్మాణానికి మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు కూలీగా మారి కంకర, సిమెంట్ నెత్తిపై మోసి కూలీలతో కలిసి పని చేశారు.
1947లో స్వాతంత్ర వచ్చిన అనంతరం శాలిగౌరారం మండలం వల్లాల గ్రామంలో 1948లో కొంతమంది విద్యార్థులు జాతీయ జెండాను ఎగరవేసిన కారణంగా అప్పటి నవాబ్ ప్రైవేట్ సైన్యమైన రజాకారులు జెండా ఎగరవేసిన వారిని ప్రభుత్వ పాఠశాలలో కాల్చి చంపారు. వారి జ్ఞాపకార్థం హనుమంతరావు ఈ చరిత్రను తెలుసుకొని వారి స్మారకార్థం స్థూపం నిర్మించాలని తలపెట్టారు. గత మూడు సంవత్సరాలుగా ఆగస్టు 15వ తేదీన వల్లాల ప్రభుత్వ పాఠశాలకు వచ్చి వారికి నివాళులు అర్పిస్తున్నారు వీహెచ్. ఈ క్రమంలోనే గత సంవత్సరం ఆయన స్థూపాన్ని నిర్మించి రాబోయే తరాలకు వారి త్యాగాన్ని తెలియజేసేలా చేస్తానని తన సొంత డబ్బులతో స్థూపం నిర్మించడానికి పూనుకున్నారు.
ఈ క్రమంలోనే బుధవారం స్థూపం నిర్మాణానికి ఫౌండేషన్ వేశారు. ఈ నేపథ్యంలోనే వీహెచ్ ఇసుక, కంకర, సిమెంట్ తట్టలు ఎత్తి కూలీగా మారారు. ఆయన ఎత్తుకున్న తట్టలో కూలీలు తక్కువ కంకర వేయడంతో.. నేను ఇంకా ముసలివాణ్ని కాలేదు.. ఇంకా తట్టలో కంకర వేయండిరా బై అంటూ తట్ట నిండా కంకర మోశారు. అనంతరం ఆయన యా్లాడుతూ.. స్వాతంత్ర్య సమరయోధుల స్తూప నిర్మాణానికి తాను కూలీగా పని చేసినందుకు గర్వంగా ఉందని హనుమంతరావు అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.