బీజేపీలో చేరిన గువ్వల బాలరాజు
నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరారు.
By అంజి
బీజేపీలో చేరిన గువ్వల బాలరాజు
నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరారు. ఆదివారం నాడు నాంపల్లిలోని పార్టీ స్టేట్ ఆఫీస్లో అధ్యక్షుడు రామచందర్ రావు బీజేపీ కండువా కప్పి బాలరాజును పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రామచందర్ రావు మాట్లాడుతూ.. బీజేపీ పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ, ప్రధాని మోదీ చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై బాలరాజు పార్టీలోకి రావడం హర్షణీయం అన్నారు. తెలంగాణలో బీజేపీ బలోపేతానికి ఆయన సేవలు వినియోగించుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ లక్ష్మణ్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, సీనియర్ నేతలు పాల్గొన్నారు.
అంతకుముందు "పార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలకు మద్ధతు ఇస్తున్నందున బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నాను. నేను ఒంటరిగా బీజేపీలో చేరుతున్నాను, నాతో పాటు ఎవరూ చేరడం లేదు" అని బాలరాజు అన్నారు. బీఆర్ఎస్పై కూడా బాలరాజు తీవ్ర విమర్శలు చేశారు. తనను చంపుతానంటూ వేలాది ఫోన్లు వచ్చాయని, ఇంత జరిగినా బీఆర్ఎస్లో ఎవ్వరూ తనను పట్టించుకోలేదని బాలరాజు అన్నారు. ఫాం హౌస్ కేసులో వంద కోట్లకు అమ్ముడుపోయానంటూ తనపై అబాండాలు మోపారని ఆవేదన వ్యక్తం చేశారు.
గువ్వల బాలరాజు 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అచ్చంపేట ఎమ్మెల్యేగా రెండుసార్లు విజయం సాధించారు.