రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే, సీపీఎం పార్టీ సీనియర్ నేత కొండిగారి రాములు(91) కన్ను మూశారు. 1989,1994 ఎన్నికలలో పోటీ చేసిన ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈరోజు ఉదయం ఆయన గుండెపోటుతో నిద్రలోనే కన్నుమూశారు. గత జూలై నెలలో ఆయన భార్య ముత్యాలమ్మ కూడా మరణించారు.
కొండిగారి రాములు స్వగ్రామం మంచాల మండలం ఆరుట్ల. ఆయన 1935వ సంవత్సరంలో జన్మించారు. చిన్ననాటి నుంచి కమ్యూనిస్టు భావాజాలం కలిగి ఉన్న ఈయన తొలిసారిగా 1989లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈయనకు ముగ్గురు సంతానం. ముగ్గురూ కుమారులే. పెద్ద కుమారుడు అనారోగ్య కారణాల వల్ల మృతి చెందారు. ఆయన మూడో కుమారుడు త్రిలోక్ కుమార్ ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 12 వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపొందారు. రాములు మృతి పట్ల ప్రముఖులు సంతాపం తెలియజేశారు.