నేడు కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్
మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరుకానున్న నేపథ్యంలో ఆయన ఎలాంటి సమాధానాలు ఇస్తారనేదానిపై ఆసక్తి నెలకొంది.
By అంజి
నేడు కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్
హైదరాబాద్: మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరుకానున్న నేపథ్యంలో ఆయన ఎలాంటి సమాధానాలు ఇస్తారనేదానిపై ఆసక్తి నెలకొంది. ఈటల రాజేందర్, హరీష్ రావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేసీఆర్ను ప్రశ్నిస్తారని సమాచారం. కాళేశ్వరాన్ని ఎప్పుడు ఆమోదించారు? మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు, సబ్ కమిటీకి బ్యారేజీలకు ఏమైన సంబంధం ఉందా? వంటి ప్రశ్నలు కేసీఆర్ను అడిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇవాళ ఉదయం 8 గంటలకు ఎర్రవల్లి ఫామ్హౌస్ నుంచి ఆయన హైదరాబాద్ చేరుకుంటారు. ఉదయం 11.30 గంటలకు బీఆర్కే భవన్లో కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ ఎదుట విచారణకు హాజరవుతారు.
కమిషన్ విచారణలో హరీష్ రావు, ఈటల రాజేందర్ ఇచ్చిన సమాధానాలను కేసీఆర్ ఇప్పటికే ఆరా తీసినట్టు తెలుస్తోంది. కమిషన్ ముందు కాళేశ్వరంపై కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్టు సమాచారం. అటు నేడు కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరవుతున్న నేపథ్యంలో ఆయనకు మద్దతుగా నిలిచేందుకు బీఆర్ఎస్ కార్యాచరణ రూపొందించింది. ఎర్రవల్లి ఫాంహౌస్ నుంచి భారీ కాన్వాయ్తో కేసీఆర్ తెలంగాణ భవన్కు చేరుకోవడం, అక్కడి నుంచి బీఆర్కే భవన్ వద్దకు రావడం.. అన్నీ ప్రత్యేకంగా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. భారీగా పార్టీ శ్రేణులు తరలివచ్చేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు.