వేలకోట్ల కుంభకోణం ఇది.. ఇందులో కేసీఆర్ కుటుంబ సభ్యుల భాగస్వామ్యం ఉంది

Ex MP Ponnam Prabhakar Fire On TRS And BJP. రాష్ట్రంలో నాలుగు బొగ్గు గనులను కేంద్రం ప్రైవేటీకరణ చేస్తుందని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది.

By Medi Samrat  Published on  12 Dec 2022 1:10 PM GMT
వేలకోట్ల కుంభకోణం ఇది.. ఇందులో కేసీఆర్ కుటుంబ సభ్యుల భాగస్వామ్యం ఉంది

రాష్ట్రంలో నాలుగు బొగ్గు గనులను కేంద్రం ప్రైవేటీకరణ చేస్తుందని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. వాస్తవంగా సింగరేణి లో ఏ నిర్ణయం తీసుకున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదం ఉండాలని కాంగ్రెస్ నేత‌, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. తాడిచెర్ల గనుల ప్రైవేటీకరణను రద్దు చేసి సింగరేణికి కేటాయించాలని డిమాండ్ చేశారు. తాడిచెర్ల బొగ్గు గనులను జెన్కో ద్వారా ఏఎంఆర్ కంపెనీకి కట్టబెట్టారని ఆరోపించారు. ఏఎంఆర్ కంపెనీకి గుట్టు చప్పుడు కాకుండా 30 ఏళ్ల కాలం పాటు అప్పజెప్పారని.. ఇందులో కేసీఆర్ కుటుంబ సభ్యుల భాగస్వామ్యం ఉంది.. వేలకోట్ల కుంభకోణం ఇది.. ఇందులో అవినీతి జరిగినట్లు స్పష్టంగా తెలుస్తోందని అన్నారు.

49 శాతం వాటా ఉన్న కేంద్రం ఎందుకు మౌనంగా ఉంటోందని ప్ర‌శ్నించారు. ఈ అంశంపై సీబీఐ, ఈడీకి, బొగ్గు మంత్రిత్వ శాఖకు లేఖ ద్వారా ఫిర్యాదు చేసిన‌ట్లు తెలిపారు. 20 వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డే చెప్పారు. కిషన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఈ బొగ్గు గనుల కేటాయింపు పై దర్యాప్తు సంస్థలతో విచారణకు అదేశించాలని డిమాండ్ చేశారు. రోశయ్య సీఎంగా ఉన్నప్పుడు ప్రైవేటీకరణ వద్దన్న వాళ్లు.. ఇప్పుడు ఎలా ఇస్తారని ప్ర‌శ్నించారు.

తాడిచెర్ల గనుల కేటాయింపు ను రద్దు చేయాలి.. కేంద్రంకు ఆ అధికారం ఉంది.. ఇది కాంగ్రెస్ పార్టీ డిమాండ్ అని అన్నారు. టీఆర్ఎస్ అవినీతి గురించి పొద్దున లేస్తే మాట్లాడే బీజేపీ.. బొగ్గుగనుల కేటాయింపు లో అవినీతి పై కమలం నేతలు ఎందుకు చర్యలు తీసుకోరని ప్ర‌శ్నించారు. బీజేపీ, టీఆర్ఎస్ ఒకటే అని ఈ ఉదంతంతో మరోసారి రుజువయ్యిందని.. ప్రకృతి వనరులను దోచుకుంటుంటే చూస్తూ ఉరుకోము అని హెచ్చిరంచారు. సింగరేణి బొగ్గు.. తెలంగాణ హక్కు.. ఈ విష‌యంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేస్తామ‌ని తెలిపారు.


Next Story