ప్ర‌జ‌లు మ‌రో పోరాటానికి సిద్ధమవుతున్నారు : ఈటెల

Etela Rajendar Comments On CM KCR. కేసీఆర్ ఉద్యమాలు, ఉద్యమ కేంద్రాలు లేకుండా చేస్తున్నార‌ని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్

By Medi Samrat  Published on  1 Dec 2021 9:42 AM GMT
ప్ర‌జ‌లు మ‌రో పోరాటానికి సిద్ధమవుతున్నారు : ఈటెల

కేసీఆర్ ఉద్యమాలు, ఉద్యమ కేంద్రాలు లేకుండా చేస్తున్నార‌ని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. తెలంగాణ ప్రజలు మరో రాజకీయ పోరాటానికి సిద్ధమవుతున్నారని ఆయ‌న అన్నారు. హైదరాబాద్ గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరుడు పోలీసు కిష్టయ్య 12 వ వర్థంతి సందర్భంగా ఈటెల రాజేందర్ నివాళులు అర్పించారు. అమరవీరులు కోరుకున్న స్వేచ్ఛయూత, ప్రజాస్వామ్య తెలంగాణ, మనిషిని మనిషి గౌరవించే తెలంగాణ రాలేదని ఈటెల అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో నిర్భందాలు, అణచివేతలు, అక్రమాలు, అన్యాయాలు, దుర్మార్గాలు, దౌర్జన్యాలు పెరిగాయని ఆరోపించారు.

స్వేచ్ఛగా ఒక వ్యక్తి ఏ రాజకీయ పార్టీలో ఉండాలో నిర్దేశించుకునే హక్కు లేదని అన్నారు. స్వేచ్ఛగా ఒక పౌరుడు నచ్చిన వ్యక్తికి ఓటు వేసుకునే పరిస్థితి లేదని ఆరోపించారు. ఆనాడు కేసీఆర్ ఏ ఉద్యమాన్ని నమ్ముకున్నారో.. అదే కేసీఆర్ ఈనాడు ఉద్యమాలు, ఉద్యమ కేంద్రాలు లేకుండా చేస్తున్నార‌ని ఆరోపించారు. యావత్తు తెలంగాణ ప్రజలు జరుగుతున్న పరిణామాలు గమనిస్తున్నారని.. తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవం కోసం మరో రాజకీయ పోరాటానికి సిద్ధమవుతున్నారని ఈటెల రాజేందర్ అన్నారు.


Next Story