బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చిన ఎన్నికల సంఘం

అధికార బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. రైతుబంధు, ప్రభుత్వ ఉద్యోగుల డీఏలు, రైతు రుణమాఫీల జారీకి

By Medi Samrat  Published on  20 Nov 2023 2:00 PM GMT
బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చిన ఎన్నికల సంఘం

అధికార బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. రైతుబంధు, ప్రభుత్వ ఉద్యోగుల డీఏలు, రైతు రుణమాఫీల జారీకి అనుమతి ఇవ్వాలంటూ కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను సంప్రదించగా తెలంగాణ ప్రభుత్వం ఆశించిన రెస్పాన్స్ రాలేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికార పార్టీ విజ్ఞప్తులను ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. పెండింగ్ డీఏలు ఇప్పుడు ఎలా ఇస్తారు? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నికల సంఘం ప్రశ్నించింది. రైతుబంధు ఆపాలంటూ కాంగ్రెస్ పార్టీ ఈసీని ఆశ్రయించిందని బీఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ స్పష్టతనిచ్చారు. రైతుబంధు ఆపాలంటూ తమకు ఎవరి నుంచి ఎలాంటి ఫిర్యాదు రాలేదని స్పష్టం చేశారు.

దేశంలో ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉండగా.. ఆయా రాష్ట్రాల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రాజకీయ పార్టీలు నగదు, మద్యాన్ని పంపిణీ చేస్తున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం అనేక ప్రాంతాల్లో నగదు, మద్యాన్ని పట్టుకుంది. ఏ రాష్ట్రాల్లో ఎంత డబ్బు, మద్యం పట్టుబడిందనే విషయాన్ని సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా తెలిపింది. నగదు, మద్యం, డ్రగ్స్ పట్టివేతలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో రూ.1760 కోట్ల విలువైన వస్తువులు స్వాధీనం చేసుకోగా.. తెలంగాణ అన్నింట్లోనూ మొదటి స్థానంలో ఉంది. తెలంగాణలో ఎన్నికల సందర్భంగా రూ.225.23కోట్ల నగదు పట్టిబడినట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. తెలంగాణలో రూ.86.82 కోట్లు విలువ చేసే లిక్కర్, రూ. 103.74 కోట్లు విలువ చేసే డ్రగ్స్, రూ. 191.02 కోట్ల విలువైన వస్తువులు స్వాధీనం చేసుకుంది. ఓటర్లకు ఇవ్వాలని చూసిన రూ.52.41 కోట్ల విలువైన వస్తువులను ఎన్నికల కమిషన్ స్వాధీనం చేసుకుంది.

Next Story