తెలంగాణలో కృష్ణా, గోదావరి జలాలపై అధికార, ప్రతిపక్షాలా మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో ఏ ప్రాజెక్టు పూర్తి చేసిందో చెప్పాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ డిమాండ్ చేశారు. 'జగన్తో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది మీరే కదా. రోజా ఇంటికి వెళ్లి కేసీఆర్ ఏం మాట్లాడారో గుర్తు లేదా? నీళ్లను ఏపీ వాడుకుంటే తప్పేముందని అనలేదా?' అని ప్రశ్నించారు. హరీశ్ రావు తెలివి లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి ఉత్తమ్ విమర్శించారు. భారీ బడ్జెట్లతో చేపట్టిన ప్రాజెక్టులు కేవలం కమీషన్ల కోసమేనని, క్షేత్రస్థాయిలో రైతులకు జరిగిన మేలు శూన్యమని ఆయన ఆరోపించారు.
గత ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ అనుసరించిన విధానాల వల్ల తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. నీళ్ల విషయంలో చరిత్ర సృష్టిస్తామని, రాష్ట్ర ముఖచిత్రం మారుస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర సాగునీటి రంగంపై తమ ప్రభుత్వానికి స్పష్టమైన దార్శనికత ఉందని మంత్రి స్పష్టం చేశారు. నీళ్ల విషయంలో రాజకీయాలు పక్కన పెట్టి, చరిత్ర సృష్టించేలా ప్రణాళికలు సిద్ధం చేశామని మంత్రి తెలిపారు. ప్రతి ఎకరాకు నీరు అందించడమే తమ ప్రభుత్వ అంతిమ లక్ష్యమని మంత్రి ఉత్తమ్ పునరుద్ఘాటించారు.