హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ఎడ్యుకేషన్ అకాడమీ ఏర్పాటుకు కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ (COL)తో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ( BRAOU) అవగాహన ఒప్పందం (MOU) కుదుర్చుకుంది. ఈ అవగాహన ఒప్పందంతో ప్రముఖ డిజిటల్ విశ్వవిద్యాలయంగా BRAOU అభివృద్ధి చెందనుంది. బోధన, అభ్యాసం, పరిశోధనలను మెరుగుపరచడానికి iDEA అత్యాధునిక డిజిటల్ హబ్గా పనిచేస్తుంది. దీంతో టెక్నాలజీ ద్వారా నాణ్యమైన విద్యను BRAOU అందించనుంది.
తెలంగాణలో విద్యా ప్రమాణాలు పెంచడంతో పాటు వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రాష్ట్రంలోని యూనివర్సిటీలను బలోపేతం చేయడంతో పాటు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ఒక నాలెడ్జ్ హబ్ గా తీర్చి దిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని COL అధ్యక్షుడు పీటర్ స్కాట్కు ముఖ్యమంత్రి వివరించారు.
ఈ సమావేశంలో కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ (COL) అధ్యక్షుడు & CEO పీటర్ స్కాట్ ( Mr. Petor Scott), ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు, BRAOU వైస్ చాన్స్ లర్ ఘంటా చక్రపాణి, సిఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.