పాఠశాలల నిర్వ‌హ‌ణ‌పై సీఎస్ సోమేశ్ కుమార్ స‌మీక్ష‌

CS Somesh Kumar Review Meeting On Schools. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్ర‌వారం

By Medi Samrat  Published on  3 Sep 2021 10:39 AM GMT
పాఠశాలల నిర్వ‌హ‌ణ‌పై సీఎస్ సోమేశ్ కుమార్ స‌మీక్ష‌

సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్ర‌వారం జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, డీహెచ్ఎంవోలు, డీపీఓలతో పాఠశాలల ప్రారంభంపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పాఠశాలల్లో విద్యార్ధుల నమోదు, టీచర్ల వ్యాక్సినేషన్ లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్షించారు. ఈ సంద‌ర్భంగా ప్రభుత్వ, ప్రయివేట్ స్కూళ్లలో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి 100 శాతం వ్యాక్సినేషన్ జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. స్కూలు బస్ డ్రైవర్లు, మద్యాహ్నాభోజన సిబ్బంది, పారిశుధ్ధ్య సిబ్బంది పాఠశాలలకు సంబంధించి ఇతరులకు(వయోజనులు) వ్యాక్సినేషన్ వేయించాలన్నారు.

ప్రతి పాఠశాల వద్ద టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి పూర్తి వ్యాక్సినేషన్ అయ్యింద‌ని, కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ పాటిస్తున్నాయని తెలియచేసే బ్యానర్ ను ప్రదర్శించాలన్నారు. పాఠశాలల్లో కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్, హైజీన్ చర్యలు పాటించేలా కలెక్టర్లు చూడాలన్నారు. ప్రతి రోజు పాఠశాలను శుభ్రపరచాలన్నారు. పాఠశాలల్లో విద్యార్ధి /ఉపాధ్యాయులు /సిబ్బంది ఎవరైనా కోవిడ్ లక్షణాలతో ఉంటే వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రి, పీహెచ్‌సీలకు తీసుకువెళ్లి కోవిడ్ టెస్ట్ చేయించాలన్నారు.

ఏదైనా పాఠశాల్లో కోవిడ్ పాజిటీవ్ కేసులు నమోదు ఐతే ఐసోలేషన్ చర్యలు తీసుకోవాలన్నారు. మద్యాహ్నాభోజనం సందర్భంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మిగిలిపోయిన పాఠశాలలకు సంబంధించి టీచింగ్ సిబ్బంది, వయోజనులకు వ్యాక్సినేషన్ కోసం ఆర్‌బీఎస్‌కే వాహానాలను వినియోగించాలన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేశ్ కుమార్, పీఆర్ అండ్ ఆర్‌డీ కమీషనర్ రఘునందన్ రావు, ఇంటర్ మీడియెట్ విద్య కార్యదర్శి ఒమర్ జలీల్, సి.డి.యం.ఎ. సత్యనారాయణ, పాఠశాల విద్యా డైరెక్టర్ దేవసేన, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు తదితర అధికారులు పాల్గొన్నారు.


Next Story