అన్నదాతల 'అపార పంట నష్టం'పై అధికారులు లెక్కలేసేనా..!

Crop loss in lakhs of acres in Telangana. తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో భారీగా పంట నష్టం జరిగింది. లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగిపోయాయి.

By అంజి  Published on  15 July 2022 5:28 AM GMT
అన్నదాతల అపార పంట నష్టంపై అధికారులు లెక్కలేసేనా..!

తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో భారీగా పంట నష్టం జరిగింది. లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగిపోయాయి. అన్నదాతలు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. భారీ మొత్తంలో పంట నష్టం జరిగినా వ్యవసాయ అధికారులు.. పంట నష్టాలను అంచనా వేయడం లేదు. ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుందో, లేదో తెలియక రైతులు ఆందోళన పడుతున్నారు. లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగి కుళ్లిపోతున్నాయి. పంట నష్టపోయిన రైతుల బాధ వర్ణనాతీతం. ఇంత జరిగినా రైతులను వ్యవసాయ అధికారులు పట్టించుకోవడం లేదు కదా.. కనీసం ఎన్ని ఎకరాల్లో పంట నష్టం జరిగిందో అంచనాలు కూడా వేయడం లేదు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'ప్రధానమంత్రి పంటల బీమా' పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేయడం లేదు. పరిహారం వచ్చే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి.

''పంటలు పూర్తిగా నాశనమయ్యాయి. రైతులు తీవ్రంగా నష్టపోయారు. అయితే వారి వివరాలు సేకరించి పంపాలని వ్యవసాయ కమిషనర్ కార్యాలయం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. అందువల్ల తాము ఏం చేయలేమని'' పేరు చెప్పని ఓ జిల్లా వ్యవసాయాధికారి తెలిపారు.

''మా దగ్గర ఎలాంటి వివరాలు లేవు. అందుకే ఏం చెప్పలేకపోతున్నాం'' అని వ్యవసాయ కమిషనర్‌ కార్యాలయ అధికారి ఒకరు తెలిపారు.

ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో 10.76 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. రైతులు తీవ్రంగా నష్టపోయారని తమ అంచనాల్లో తేలినట్లు రైతు సంఘాలు చెబుతున్నాయి.


సోయా, పత్తి, వరి పంటలు అత్యధికంగా వరదల్లో మునిగిపోయాయి. ఆదిలాబాద్‌ జిల్లా పరిధిలోని 18 మండలాల్లో 1,03,305 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు లోకల్ అథారిటీస్ అనధికారికంగా అంచనా వేశాయి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 49వేల 591 ఎకరాల పంట నష్టం సంభవించినట్టు సమాచారం. కరీంనగర్‌లో 15 వేలు, పెద్దపల్లి జిల్లాలో 6,493 వేలు, కుమురం భీంలో 47,345, నిర్మల్‌ జిల్లాలో 20,294 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు సమాచారం. కొన్ని జిల్లాల్లో పంటలు నీటమునిగినా వ్యవసాయాధికారులు వివరాలు బయటికి చెప్పడం లేదు.

భారీ వర్షాల కారణంగా పొలాల్లో నిలిచిన నీటిని వెంటనే బయటికి పంపేలా రైతులు చర్యలు తీసుకోవాలని ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం తెలిపింది. అధిక తేమ వల్ల తెగుళ్లు వ్యాప్తి చెందే ఛాన్స్‌ ఉందని, సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచించింది. పత్తి, సోయా, మొక్కజొన్న వంటి పంటలు ప్రస్తుతం మొక్కల దశలో ఉన్నాయని, అవి ఎక్కువ రోజులు నీటిలో ఉంటే అధిక తేమను తట్టుకోలేక చనిపోతాయని సీనియర్ వ్యవసాయ అధికారి ఒకరు చెప్పారు.


ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సాంగ్వి గ్రామ శివారులోని సాత్నాల వాగు ఉధృతంగా ప్రవహించడంతో పక్కనే ఉన్న పొలాల్లో భారీగా ఇసుక దిబ్బలు వేశాయి. పొలాలను చూస్తుంటే మైదాన ప్రాంతాలను తలపిస్తున్నాయి. ఏర్మా భగవత్‌రావ్‌ అనే రైతు 8 ఎకరాల్లో వేసిన సోయా, పత్తి పంటలు మునిగిపోయి నాశనమయ్యాయి. అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టినా, పంట పూర్తిగా దెబ్బతినడంతో ఎలా తిరిగి కట్టాలో తోచడం లేదని రైతులు వాపోతున్నారు.

అయితే, భారీ వర్షాలు పడ్డప్పటికీ రాష్ట్రంలో పెద్దగా పంట నష్టం జరిగినట్లు సమాచారం లేదని, కొందరు తెలిసీ తెలియక మాట్లాడుతున్నారని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఎన్నడూలేని విధంగా జూలై నెలలోనే రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం నమోదైందని తెలిపారు. వరద పరిస్థితిపై రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో మంత్రి కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Next Story