నేటి నుంచి రైతుల ఖాతాల్లోకి డబ్బులు!
యాసంగి పంట సాగు కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేయనుంది.
By అంజి Published on 12 Dec 2023 7:30 AM IST
నేటి నుంచి రైతుల ఖాతాల్లోకి డబ్బులు!
తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్న్యూస్ చెప్పారు. యాసంగి పంట సాగు కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేయనుంది. ఎకరాకు రూ.5 వేల చొప్పున రైతుల ఖాతాల్లోకి జమ చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీంతో నేటి నుంచి రైతుల అకౌంట్లలో డబ్బులు పడనున్నట్టు సమాచారం. కాగా.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా కింద ఇవ్వాల్సిన సాయానికి విధివిధానాలు ఖరారు కాకపోవడంతో రైతుబంధు నిబంధనలతో సాయం అందించాలని నిర్ణయించారు.
అయితే విధి విధానాల రూపకల్పనకు సమయం లేకపోవడంతో రైతులకు పంట పెట్టుబడి సాయం కింద చెల్లింపులు ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ట్రెజరీలో ఉన్న నిధులను విడుదల చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు రాష్ట్రంలోని పలు చోట్ల రైతులు యాసంగి పంట కోసం పొలం పనులు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. డిసెంబర్ 9 తేదీనే రైతు భరోసా డబ్బులు అన్నదాతల అకౌంట్లలో వేస్తానని మాట ఇచ్చారని.. కానీ ఇప్పటికి కూడా పెట్టుబడి సాయంపై క్లారిటీ లేదని బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు.