సీఎం కేసీఆర్‌కు త‌మ్మినేని లేఖ‌.. వారికి న్యాయం చేయండి

CPM Leader Thammineni Veerabhadram Letter to CM KCR. డీఎస్సీ-1998 క్వాలిఫైడ్‌ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చి న్యాయం చేయాలని కోరుతూ

By Medi Samrat  Published on  1 Oct 2022 9:19 AM GMT
సీఎం కేసీఆర్‌కు త‌మ్మినేని లేఖ‌.. వారికి న్యాయం చేయండి

డీఎస్సీ-1998 క్వాలిఫైడ్‌ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చి న్యాయం చేయాలని కోరుతూ సీపీఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి తమ్మినేని వీరభద్రం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నిర్వహించిన డీఎస్‌స్సీ-98లో క్వాలిఫైడ్‌ అభ్యర్థుల నియామకాలు నేటికీ చేపట్టకపోవడంతో సుమారు 1500 మంది తెలంగాణ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ అప్పటి నుండి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వీరికి ఉద్యోగాలిస్తామని ఎన్నికల సమయంలో మీరు హామి ఇచ్చారు. అనంతరం 2016 జనవరి 3న అభ్యర్థులతో ప్రగతిభవన్‌లో చర్చలు జరిపి, వయో పరిమితితో సంబంధం లేకుండా స్పెషల్‌ కేసుగా పరిగణించి అవసరమైతే ''సూపర్‌ న్యూమరీ'' పోస్టులను క్రియేట్‌ చేసైనా మానవతా దృక్పధంతో వీరికి న్యాయం చేస్తామని వాగ్ధానం చేసారు. వీరికి ఉద్యోగాలు ఇస్తామని అసెంబ్లీలో అప్పటి విద్యాశాఖమంత్రి అధికారిక ప్రకటన చేసారు. కానీ ప్రభుత్వం నేటికీ వీరికి ఉద్యోగాలు ఇవ్వలేదు.

1998 డీఎస్‌సీలో క్వాలిఫైడ్‌ అయిన అభ్యర్థులందకి మినిమం టైం స్కేల్‌ చెల్లింపులతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవడానికి చర్యలు చేపట్టింది. కానీ మన రాష్ట్రంలో నేటికీ ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. ఇది అభ్యర్థులకు తీవ్ర నష్టం. కాబట్టి మన రాష్ట్రంలో కూడా సుదర్ఘీకాలంగా ఎదురుచూస్తున్న డీఎస్‌స్సీ-98 క్వాలిఫైడ్‌ అభ్యర్థులందరికీ వెంటనే ఉద్యోగాలు ఇచ్చి న్యాయం చేయాలని సీఎం కేసీఆర్‌ను సీపీఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి తమ్మినేని వీరభద్రం కోరారు.




Next Story