రాష్ట్ర, జాతీయ రాజకీయాలకు మునుగోడు ఎన్నికలు దిక్సూచిగా మారాలి

Coordinated meeting of Munugodu mandal workers of Congress party. మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు.

By Medi Samrat  Published on  19 Sep 2022 10:43 AM GMT
రాష్ట్ర, జాతీయ రాజకీయాలకు మునుగోడు ఎన్నికలు దిక్సూచిగా మారాలి

మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ పార్టీ మునుగోడు మండల కార్యకర్తల సమన్వయ సమావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి.. మునుగోడు గడ్డపై కాంగ్రెస్ జెండాను ఎగుర‌వేస్తుంద‌న్నారు. అధికార, అహంకారంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీడియాను గుప్పిట్లోకి తీసుకొని భయపెట్టో.. ప్రలోభ పెట్టో.. వారికి అనుకూలంగా ప్రచార ఆర్భాటం చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్ సిద్ధాంత భావజాలమే ప్రజలను ఆకర్షిస్తుంది.. పార్టీని గెలిపిస్తుందని అన్నారు. గత ఎనిమిది సంవత్సరాలుగా టిఆర్ఎస్, బిజెపిలు ప్రజా సంక్షేమాన్ని విస్మరించాయని ఫైర్ అయ్యారు.

పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలు డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు తగ్గాలంటే బీజేపీని ఓడించాలి. కాంగ్రెస్ ను గెలిపించాలని అన్నారు. దేశ సంపదను అమ్ముతూ.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ.. నియంతృత్వ పోకడలతో దేశాన్ని ఏలుతున్న బిజెపిని మునుగోడులో ఓడించి.. ఇక ప్రజా వ్యతిరేక పాలన చాలు అన్న సందేశాన్ని దేశానికి ఇవ్వాలని పిలుపునిచ్చారు. ధరల పెరుగుదలతో దేశ ప్రజలు ఆందోళన చెందుతూ.. ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. కానీ మునుగోడు ప్రజలకు బ్రహ్మాస్త్రంగా ఉన్న ఓటుతో వారికి బుద్ధి చెప్పాలని అన్నారు.

8 సంవత్సరాలుగా తెలంగాణ సంపదను టీఆర్ఎస్ పాలకులు దోపిడీ చేయడమే కాకుండా ఐదు లక్షల అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళ తీయించారని విమ‌ర్శించారు. మిషన్ భగీరథ, చెరువుల పూడిక తీత పేరిట రాష్ట్రంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని అన్నారు. ప్రతి పౌరుడుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తలసరి అప్పు 2.25 లక్షలు భారం మోపారని.. అప్పులు చేసి తెలంగాణను దివాలా తీయించడానికేనా? కొట్లాడి తెలంగాణ తెచ్చుకుందని ప్ర‌శ్నించారు.

ఎస్ఎల్బిసి టన్నెల్ సొరంగం పనులు పూర్తి చేయకుండా.. మునుగోడు ప్రాంతానికి నీళ్ళు రాకుండా అడ్డుకుంది టిఆర్ఎస్ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే పెండింగ్‌లో ఉన్న అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసి కృష్ణా నదిలో ఉన్న నీళ్లను పొలాల్లోకి గలగల పారించే వాళ్ళమ‌ని అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి విజయం కోసం కాంగ్రెస్ కార్యకర్తలు సైనికుల వలె పని చేయాలని అన్నారు.

కేంద్రంలో రాష్ట్రంలో అధికారం ఉన్న బీజేపీ, టీఆర్ఎస్ లకు వ్యతిరేకంగా ఓటు వేస్తేనే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయ‌న్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తే వచ్చే సాధారణ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి దోహదప‌డుతుంద‌ని అన్నారు. రాష్ట్ర జాతీయ రాజకీయాలకు మునుగోడు ఎన్నికలు దిక్సూచిగా మారాలి. మద్యం ప్రలోభాలకు ఓటును వృధా చేయొద్దు. ప్రజా సంక్షేమ రాజ్యానికే మీ ఓటును బ్రహ్మాస్త్రంగా ఉపయోగించాలని పిలుపునిచ్చారు.


Next Story