రాష్ట్రంలో కేసీఆర్ ఒక్కొక్కరిపై లక్షా న‌ల‌భై వేల అప్పు మోపారు : మల్లికార్జున ఖర్గే

మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారని కాంగ్రెస్ అధ్య‌క్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు

By Medi Samrat  Published on  25 Nov 2023 1:45 PM GMT
రాష్ట్రంలో కేసీఆర్ ఒక్కొక్కరిపై లక్షా న‌ల‌భై వేల అప్పు మోపారు : మల్లికార్జున ఖర్గే

మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారని కాంగ్రెస్ అధ్య‌క్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. కల్వకుర్తి బ‌హిరంగ‌స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ.. కేసీఆర్ తెలంగాణకు 5 లక్షల 70వేల కోట్ల అప్పు మిగిల్చారని.. రాష్ట్రంలో ఒక్కొక్కరిపై 1 లక్ష 40 వేల అప్పు మోపారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని ఏర్పాటు చేసి తీరుతామ‌న్నారు. కేసీఆర్.. ఇందిరమ్మను, సోనియమ్మను, రాహుల్ గాంధీని విమర్శిస్తున్నారు. దేశంలో పేదరికాన్ని నిర్మూలించిన ఘనత ఇందిరమ్మది.. బ్యాంకుల జాతీయకరణ చేసిన ఘనత ఇందిరమ్మది.. ఆనాడు పేదలకు భూములు పంచి వారికి అండగా నిలిచింది ఇందిరమ్మ అని వివ‌రించారు.

కాంగ్రెస్ పాలనలోనే పేదలకు సంక్షేమం అందిందన్నారు. ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు మేలు జరుగుతుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామ‌న్నారు. చేయూత పథకం ద్వారా రూ. 4వేలు పెన్షన్.. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు పేదలకు ఉచిత వైద్యంకు సాయం.. ప్రతీ ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామ‌ని హామీ ఇచ్చారు. కేసీఆర్, మోదీలా మేం బూటకపు హామీలు ఇవ్వమ‌న్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేసి తీరుతుందన్నారు. కాంగ్రెస్ గెలుపును ఆపేందుకు బీజేపీ, బీఆరెస్ కలిసి కుట్రలు చేస్తున్నాయని విమ‌ర్శించారు. కాంగ్రెస్ ను గెలిపించండి... కేసీఆర్ అవినీతి పాలనను అంతం చేయండని పిలుపునిచ్చారు.

Next Story