బీసీ సర్వే రిపోర్టు అందుకే తగులబెట్టా..తీన్మార్ మల్లన్న హాట్ కామెంట్స్
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన షోకాజు నోటీసులు తీసుకున్న.. బీసీలకు ఎందుకు రాజ్యాధికారం రాదో చూస్తానని సవాల్ చేశారు.
By Knakam Karthik Published on 5 March 2025 1:23 PM IST
బీసీ సర్వే రిపోర్టు అందుకే తగులబెట్టా..తీన్మార్ మల్లన్న హాట్ కామెంట్స్
తనను పార్టీ నుంచి బహిష్కరించినంత మాత్రాన తెలంగాణలో బీసీల ఉద్యమం ఆగుతుందనే భ్రమ ఉంటే ప్రభుత్వ పెద్దలు దానిని తొలగించుకోవాలని కాంగ్రెస్ బహిష్కృత నేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన షోకాజు నోటీసులు తీసుకున్న.. బీసీలకు ఎందుకు రాజ్యాధికారం రాదో చూస్తానని సవాల్ చేశారు. తాము వెనుకటి బీసీలం కాదని.. ఆధునీకరించుకుని, ఆలోచన మెరుగుపరుచుకుని వచ్చిన మలిదశ బీసీ ఉద్యమకారులమని వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల జరిగిన ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పాల్గొన్న బీసీ వాదులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తనకు షోకాజు నోటీసులు పంపించేలా ప్రయత్నం చేసిన సీఎం రేవంత్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ సెటైర్లు వేశారు. ఆయన దగ్గర ప్రతి ఒక్కరూ బానిసగా పడి ఉండాలని రేవంత్ రెడ్డి కోరుకున్నారని.. కానీ, తీన్మార్ మల్లన్న విషయంలో సాధ్యం కాదని అన్నారు.
రాష్ట్రంలో చేపట్టిన కులగణనలో తప్పులు దొర్లాయని.. సర్వే రిపోర్టు చిత్తు కాగితంతో సమానమని అన్నారు. బీసీలు, ప్రజలను మోసం చేసేందుకు చేపట్టిన సర్వే రిపోర్టు చిత్తు కాగితమనే తాను తగులబెట్టానని క్లారిటీ ఇచ్చారు. బీసీలకు న్యాయం జరగాలని కోరి తగులబెట్టడం తప్పు అయితే.. ఆ తప్పును తాను వెయ్యి సార్లు చేస్తానని అన్నారు. దేశానికి ఆదర్శంగా నిలిచే కులగణన చేయబోతున్నాం, తమ జన్మ సార్థకం అయిందంటూ ప్రభుత్వ పెద్దలు డైలాగులు కొట్టి సర్వేను తప్పుదోవ పట్టించారని తీన్మార్ మల్లన్న ఆరోపించారు. బీసీలకు నిజంగా న్యాయం చేయాలని ఉంటే.. సర్వే ప్రారంభమైన తొలిరోజే సీఎం ఆయన ఇంట్లో, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారి వారి ఇళ్లో సర్వేలో పాల్గొని అందరికీ ఆదర్శంగా ఉండేలా చూపించే వాళ్లని కామెంట్ చేశారు.
కానీ, కాంగ్రెస్ ప్రభుత్వంలో అవేమి జరగలేదని అన్నారు. 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చేపట్టిన సకల జనుల సర్వేకు విపరీత స్పందన వచ్చిందని అన్నారు. దుబాయ్, ముంబై, ఇతర దేశాలకు వలస వెళ్లిన వాళ్లు సైతం సర్వేలో పాల్గొన్నారని తీన్మార్ మల్లన్న అన్నారు. కానీ, నేటి ప్రభుత్వం తూతూమంత్రంగా సమగ్ర సర్వే చేపట్టిందని అన్నారు. బీసీలపై చిత్తశుద్ధి ఉన్న నాయకుడు కులగణనపై నిత్యం మానిటరింగ్ చేయాలని.. కానీ, సీఎం రేవంత్ రెడ్డి సర్వే ముగిశాక సమీక్ష చేపట్టారని ఫైర్ అయ్యారు. సర్వే రిపోర్టు తప్పని తాను తగులబెడితే.. ప్రభుత్వం రీసర్వే ఎందుకు చేపట్టిందని ప్రశ్నించారు. 3.54 లక్షల ఇళ్లలో సర్వే జరగలేదని.. మరో 16 లక్షల మంది సర్వేలో ఎంట్రీ కావాలని ప్రభుత్వం చెప్పిందని అన్నారు. కానీ, ఆ సంఖ్య సర్కార్ ప్రాతిపదికన చెప్పిందో అర్థం కావడం లేదని అన్నారు. ఇది కేవలం ఈడబ్ల్యూఎస్ను రక్షించుకునేందుకే సీఎం రేవంత్ రెడ్డి వేసిన ఎత్తుగడ అని తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.