అన్ని బాగున్నప్పుడు కాదు.. ఇప్పుడు మూడు స్థానాల్లో పోటీ చేయ్యండి

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వచ్చాక మాజీ మంత్రి కేటీఆర్‌ మేకపోతు గాంభీర్యం ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

By Medi Samrat  Published on  27 March 2024 10:22 AM GMT
అన్ని బాగున్నప్పుడు కాదు.. ఇప్పుడు మూడు స్థానాల్లో పోటీ చేయ్యండి

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వచ్చాక మాజీ మంత్రి కేటీఆర్‌ మేకపోతు గాంభీర్యం ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గాంధీభ‌వ‌న్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్, కేటీఆర్‌లు జైలుకు వెళ్లాల్సిందేన‌ని జోస్యం చెప్పారు. నవీన్ రావు, శ్రవణ్ రావు సర్వేంట్ ఎక్విప్మెంట్ కొనుగోలు చేశారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఇంటలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఈ విషయం లో మీ ప్రమేయం లేకపోతే లైవ్ డీటేక్టర్ కు వస్తారా..? అని స‌వాల్ విసిరారు.

ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదన్నారు. పదేండ్ల పాలన లో ప్రయివేట్ ట్యాపింగ్ యూనివర్సిటీ లు ఏర్పాటు చేశారని ఆరోపించారు. శ్రవణ్ రావు, నవీన్ రావు ఫోన్ ట్యాపింగ్ తో వ్యక్తులను బెదిరించి వందల కోట్లు దండుకున్నారని.. ఫోన్ ట్యాపింగ్ విషయంలో సిట్ వేసి.. లోతైన దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.

ధరణిలో కొన్ని వందల ఎకరాలు నవీన్ రావు పేరుపై బదాలయించార‌ని ఆరోపించారు. నిఘా వ్యవస్థను దుర్వినియోగం చేశారని మండిప‌డ్డారు. చెల్లి కవిత తీహార్ జైలుకు వెళ్తే.. కేటీఆర్‌ మాత్రం ఎమ్మెల్సీ సీటు కోసం గోవాలో చిందులు వేశాడని దుయ్య‌బ‌ట్టారు.

కేటీఆర్‌.. నీకు సీఎం రేవంత్ ను విమర్శించే అర్హత లేదన్నారు. అన్ని బాగున్నప్పుడు మీ ఫ్యామిలీ మెంబెర్స్ పోటీ చేయడం కాదు.. ఇప్పుడు ఎందుకు చేయడం లేదని ప్ర‌శ్నించారు. ముగ్గురు కుటుంబ సభ్యులు మూడు చోట్ల పోటీ చేయాలని స‌వాల్ విసిరారు.

ఫోన్ ట్యాపింగ్ విషయంలో చాలా మంది భాదితులు ఉన్నారు. తాను డీజీపీ కి పిర్యాదు చేసినట్లు.. అందరూ పిర్యాదు చేయాలని పిలుపునిచ్చారు. ప్రతీ జిల్లాలో ఒక సెంటర్ ఏర్పాటు చేసి.. ఫోన్ ట్యాపింగ్ ఫిర్యాదులు స్వీకరించాలన్నారు. రాష్ట్రంలో వీళ్ల ఆగడాలు తెలిసి కూడా.. కేంద్రంలో ఉన్న వ్యక్తులు మౌనంగా ఎందుకు ఉన్నారో అర్ధం కావడం లేదన్నారు. దొంగలు, దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్న చందంగా.. బీజేపీ, బీఆర్ఎస్‌ వ్యవహరించాయని విమ‌ర్శించారు.

Next Story