విజయమ్మ, షర్మిళ ప్రవర్తనతో వైఎస్ఆర్ ఆత్మ క్షోభిస్తుంది : కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు
Congress Leader Niranjan Fires On Sharmila. వైఎస్ విజయమ్మ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మీయ సమ్మేళనం పేరుతో సభ పెట్టడం సరికాదని
By Medi Samrat Published on 3 Sep 2021 11:43 AM GMT
వైఎస్ విజయమ్మ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మీయ సమ్మేళనం పేరుతో సభ పెట్టడం సరికాదని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి. నిరంజన్ వ్యాఖ్యానించారు. రాజకీయాలకు అతీతంగా ఆత్మీయ సమ్మేళనం అని చెప్పి విజయమ్మ రాజకీయాలు మాట్లాడారని అన్నారు. రాజకీయాలకు అతీతంగా అని చెప్పి అందరినీ పిలిచి రాజకీయాలు మాట్లాడటం దగా చేయడమే అని అభిప్రాయడ్డారు. షర్మిళ తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొచ్చేందుకు వచ్చిందని.. ఆశీర్వదించండి అని అడగటం సరికాదని అన్నారు.
వైఎస్ బ్రతికి ఉంటే రాష్ట్ర విభజన జరిగేది కాదు అనేలా మాట్లాడటం సరికాదని అన్నారు. వైఎస్ బ్రతికి ఉన్నంత కాలం అసలైన కాంగ్రెస్ వాది అని.. ఈ విషయాన్ని షర్మిళ గుర్తు పెట్టుకోవాలని హితువు పలికారు. నాడు వైఎస్ హయాంలో ప్రవేశపెట్టిన పథకాలు.. కాంగ్రెస్ అధిష్టానం అనుమతితో ప్రవేశపెట్టినవే అని.. ఆ పథకాలన్నీ వైఎస్ పథకాలని విజయమ్మ, షర్మిళ మాట్లాడటం దురదృష్టకరమని అన్నారు. కాంగ్రెస్ లేకుంటే వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయ్యేవారా..? అని ప్రశ్నించారు.
తెలంగాణ ప్రాంతం వారి తరుపున మీరు కొట్లాడాల్సిన అవసరం లేదని.. మా రాష్ట్ర సమస్యలపై కోట్లాడే సత్తా ఈ ప్రాంతం వారికి ఉందని అన్నారు. మీరు రాజకీయ ప్రయోజనాల కోసం ఇక్కడికి వచ్చారనేది ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసనని.. మీకు గౌరవం ఇస్తున్నాం అంటే మీరు వైఎస్ కుటుంబ సభ్యులనేనని.. మీరు హద్దులు దాటితే.. మీకు సరైన బుద్ది చెబుతామని సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయమ్మకు పతి భక్తి కంటే బిడ్డల రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం అయ్యాయని.. విజయమ్మ, షర్మిళ ప్రవర్తనతో వైఎస్ఆర్ ఆత్మ క్షోభిస్తుందని వ్యాఖ్యానించారు.