తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం పచ్చజెండా ఊపింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని సర్కార్లో త్వరలోనే కొత్త మంత్రులు చేరే ఛాన్స్ ఉంది. కొత్తగా ముగ్గురు లేదా నలుగురు కేబినెట్లో చోటు దక్కే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే హస్తం పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది.
రాష్ట్ర కేబినెట్ విస్తరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంతనాలు సాగిస్తున్నారు. పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో పీసీసీ, సీఎం ఇప్పటికే ఇందుకు సంబంధించిన చర్చలు పూర్తి చేశారు. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు, సామాజిక వర్గాల సమీకరణపై చర్చించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కేబినెట్ విస్తరణ జరగడం ఇదే తొలిసారి.
అధిష్ఠానం నుంచి సూత్రప్రాయంగా అనుమతి లభించడంతో, మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవాలనే దానిపై ముఖ్యమంత్రి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మంత్రివర్గ విస్తరణకు పార్టీ అధిష్ఠానం ఆమోదం తెలపడంతో ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.