తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు: కాంగ్రెస్ ప్రభంజనం

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తిరుగులేని శక్తిగా అవతరించింది. మొత్తం 116 మున్సిపాలిటీల్లోని...

By -  అంజి
Published on : 14 Feb 2026 6:51 AM IST

Telangana Municipal Election Results 2026, Congress Victory, Revanth Reddy, BRS, BJP, Hung Municipalities, Telangana Urban Polls, Medak Congress Surge, Municipal Corporation Results

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు: కాంగ్రెస్ ప్రభంజనం

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తిరుగులేని శక్తిగా అవతరించింది. మొత్తం 116 మున్సిపాలిటీల్లోని 2,582 వార్డులకు గాను 1,347 వార్డులను కైవసం చేసుకుని, 64 మున్సిపాలిటీల్లో స్పష్టమైన అధికారాన్ని దక్కించుకుంది. మొత్తం మీద దాదాపు 90 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా నిలిచి, రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో తన పట్టును చాటుకుంది.

బిఆర్ఎస్ 717, బిజెపి 261; స్వతంత్రుల జోరు

భారత్ రాష్ట్ర సమితి (BRS) 717 వార్డులను గెలుచుకుని 13 మున్సిపాలిటీలను దక్కించుకోగా, భారతీయ జనతా పార్టీ (BJP) 261 వార్డుల్లో విజయం సాధించింది. స్వతంత్ర అభ్యర్థులు 256 చోట్ల గెలుపొందారు. మరోవైపు, 38 మున్సిపాలిటీల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో (హంగ్), అక్కడ ఇతర పార్టీల మద్దతు కీలకం కానుంది.

క్లీన్ స్వీప్‌లు, కంచుకోటలు

రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యాలయాల్లో సంబరాలు మిన్నంటాయి. ధర్మపురి, కోస్గి వంటి మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. నందికొండ, చిట్యాల, భీంగల్, మారిపెడ, డోర్నకల్, చండూర్, హాలియా, చొప్పదండి, సుల్తానాబాద్, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్ వంటి కీలక మున్సిపాలిటీలను కాంగ్రెస్ గెలుచుకుంది. ఉత్తర తెలంగాణ నుంచి దక్షిణ తెలంగాణ వరకు పార్టీ తన జోరును కొనసాగించింది. మధిర, అశ్వారావుపేట, వైరా, ఇల్లందు, ఎదులాపురంలో పార్టీ భారీ మెజారిటీ సాధించింది.

ఉమ్మడి మెదక్‌లో అనూహ్య ఫలితాలు

మాజీ సీఎం కేసీఆర్ ఇలాకాగా భావించే ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ సత్తా చాటింది. సంగారెడ్డి మున్సిపాలిటీలో 38 వార్డులకు గాను 20కి పైగా స్థానాలను, సదాశివపేటలో 26కి 16 స్థానాలను సాధించింది. మంత్రి దామోదర రాజనర్సింహ నియోజకవర్గమైన జోగిపేటలో 20 వార్డులకు గాను 16 వార్డుల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక్కడ AIMIM కేవలం ఒక్క సీటుకే పరిమితమైంది. జగిత్యాలలో సీనియర్ నేత జీవన్ రెడ్డి మద్దతుదారులు స్వతంత్రులుగా పోటీ చేసి మెజారిటీ స్థానాలు గెలవడం విశేషం.

హంగ్ కౌన్సిళ్లు, వింత ఫలితాలు

నరసాపూర్: ఇక్కడ కాంగ్రెస్, బిఆర్ఎస్ మధ్య ఒక వార్డులో టై రావడంతో టాస్ వేయగా, బిఆర్ఎస్ గెలిచింది. ఫలితంగా కౌన్సిల్ హంగ్ అయ్యింది.

మక్తల్: బిజెపి అభ్యర్థి ఆత్మహత్యతో ఒక వార్డులో ఎన్నిక వాయిదా పడింది. మిగిలిన 16 వార్డుల్లో కాంగ్రెస్ 12, బిజెపి 3 గెలిచాయి.

వడ్డేపాలెం: మహబూబ్ నగర్ జిల్లాలోని ఈ మున్సిపాలిటీని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గెలుచుకుంది.

కార్పొరేషన్ ఫలితాలు

ఏడు మున్సిపల్ కార్పొరేషన్లలో:

కాంగ్రెస్: మంచిర్యాల, రామగుండం, నల్గొండ కార్పొరేషన్లను గెలుచుకుంది.

కొత్తగూడెం: కాంగ్రెస్ (22), సిపిఐ (22) సమాన స్థానాలు సాధించగా, బిఆర్ఎస్ 8 స్థానాలు పొందింది. ఇక్కడ మేయర్ పీఠం కోసం బిఆర్ఎస్-సిపిఐ పొత్తు చర్చల్లో ఉన్నాయి.

కరీంనగర్, నిజామాబాద్‌లలో బిజెపి ఆధిక్యంలో ఉండగా, మహబూబ్ నగర్‌లో కాంగ్రెస్ ముందంజలో ఉంది.

ప్రజా పాలనకు నిదర్శనం: సీఎం రేవంత్ రెడ్డి

మున్సిపల్ ఫలితాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. ఇది రెండేళ్ల తమ 'ప్రజా పాలన'కు ప్రజలు ఇచ్చిన తీర్పు అని కొనియాడారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి అజెండాకు ప్రజలు పట్టం కట్టారని, ఈ విజయం తమ బాధ్యతను మరింత పెంచిందని ఆయన పేర్కొన్నారు.

Next Story