టీఎస్ఆర్టీసీ కానిస్టేబుళ్ల శిక్షణ ముగింపు

Completion of TSRTC Constables Training. హైదరాబాద్ కొండాపూర్ లోని 8వ బెటాలియన్ లో ఆదివారం టీఎస్ఆర్టీసీకి చెందిన 166 మంది కానిస్టేబుళ్ల శిక్షణ ముగింపు

By Medi Samrat  Published on  19 March 2023 8:38 AM GMT
టీఎస్ఆర్టీసీ కానిస్టేబుళ్ల శిక్షణ ముగింపు

Completion of TSRTC Constables Training


హైదరాబాద్ కొండాపూర్ లోని 8వ బెటాలియన్ లో ఆదివారం టీఎస్ఆర్టీసీకి చెందిన 166 మంది కానిస్టేబుళ్ల శిక్షణ ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ హాజరయ్యారు. శిక్షణ పొందిన కానిస్టేబుళ్ల నుంచి వారు గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుళ్ల విన్యాసాలు ఆకట్టుకున్నాయి.


కారుణ్య నియామకం ద్వారా టీఎస్ఆర్టీసీలో ఇటీవల 166 మంది కానిస్టేబుళ్లుగా నియమితులయ్యారు. వారిలో 107 మంది పురుషులు కాగా, 57 మంది మహిళలు ఉన్నారు. హైదరాబాద్ లోని కొండాపూర్ 8వ బెటాలియన్ లో పోలీస్ శాఖ సహకారంతో 166 మందికి ఒక నెల శిక్షణ ఇవ్వడం జరిగింది. వారంతా విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లో చేరబోతున్నారు.


కానిస్టేబుళ్ల శిక్షణ ముగింపు కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ మాట్లాడుతూ.. సంస్థకు కానిస్టేబుళ్లు కండ్లు, చెవుల లాంటి వారన్నారు. కొత్తగా విధుల్లో చేరబోతున్న కానిస్టేబుళ్లకు అభినందనలు తెలుపుతూనే.. నిబద్ధతతో పనిచేయాలన్నారు. కర్తవ్యాన్ని విస్మరించొద్దని, తప్పు చేస్తే చర్యలు తప్పవన్నారు. టీఎస్ఆర్టీసీ కానిస్టేబుల్ ఉద్యోగం ఈజీ కాదని, క్రమశిక్షణతో పనిచేయాలని సూచించారు. సంస్థలోని 50 వేల మంది సిబ్బందిని, బస్సులను కాపాడాల్సిన బాధ్యత మీపై ఉందనే విషయం మరచిపోవద్దన్నారు. రాబోయే కాలంలో ఆర్టీసీని ఇంకా ముందుకు తీసుకొని పోయి లాభాల బాట పట్టేట్లు చూడాలన్నారు. గత ఏడాదిగా వినూత్న కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువ అవుతున్నామని చెప్పారు. కొత్త బస్సులను కొనుగోలు చేస్తూనే.. నియామకాలను చేపడుతున్నామని పేర్కొన్నారు.

టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ మాట్లాడుతూ.. కొత్తగా 166 మంది కానిస్టేబుళ్లు టీఎస్ఆర్టీసీలో చేరుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. అందులో మూడో వంతు 57 మంది మహిళలు ఉండటం శుభపరిణామన్నారు. ఈ కొత్త రక్తంతో సంస్థ మరింత అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. శిక్షణలో మాదిరిగానే నిబద్ధతతో విధులు నిర్వహించాలని కానిస్టేబుళ్లకు సూచించారు. 2014 నుంచి ఇప్పటివరకు కారుణ్య నియామ‌కాల కింద 1606 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని తెలిపారు.

సంస్థ‌లో కానిస్టేబుల్స్ బాధ్య‌త ఎంతో కీల‌కం అనే విష‌యం మీకు తెలియంది కాదని, చిత్త‌శుద్ధితో పని చేస్తూ సంస్థ అభ్యున్న‌తికై మీవంతుగా తోడ్పాటునందించాలన్నారు. టీఎస్ఆర్టీసీ వృద్ధి కోసం 50 వేల మంది సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారని, అందులో మీరు భాగం కావాలని పిలుపునిచ్చారు. ఒక నెలలో సమర్థవంతంగా కానిస్టేబుళ్లకు శిక్షణ ఇచ్చిన టీఎస్ఎస్పీ అదనపు డీజీపీ స్వాతి లక్రాకు, కొండాపూర్ 8 వ బెటాలియన్ కమాండెంట్ మురళి కృష్ణకు ఈ సందర్బంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ శిక్షణలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన సృజన్(బెస్ట్ ఆల్ రౌండర్), రమా దేవి(బెస్ట్ ఇండోర్), పూజిత, సాయి కిరణ్(బెస్ట్ ఔట్ డోర్)లకు ట్రోఫీలను అందజేశారు.


Next Story