జంటనగరాల్లో పేదలకు కష్టం వచ్చినప్పుడు గుర్తొచ్చేది ఇద్దరే నాయకులు, ఒకరు పీజేఆర్, మరొకరు దత్తాత్రేయ..అని తెలంగాణ సీఎం రేవంత్ అన్నారు. హైదరాబాద్లోని శిల్పకలావేదికలో ఆదివారం హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ జీవిత చరిత్ర ఆధారంగా రాసిన ప్రజల కథే నా ఆత్మకథ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ. జాతీయ స్థాయిలో అటల్ బిహారీ వాజ్పేయీ తరహాలో తెలంగాణలో బండారు దత్తాత్రేయ ఉన్నారు. గౌలిగూడ గల్లీ నుంచి హర్యాణా గవర్నర్గా దత్తాత్రేయ ఎదిగారు. ఆయన జీవితంలో ఎన్నో పదవులు అధిష్టించినా ఎప్పుడూ ప్రజలకు దూరం కాలేదు..అని సీఎం మాట్లాడారు.
దత్తాత్రేయతో వ్యక్తిగతంగా నాకు చాలా సన్నిహిత సంబంధం ఉంది. అజాత శత్రువు అనే పదం బండారు దత్తాత్రేయకు సరిగ్గా సరిపోతుంది. పదవిలో ఉన్నా లేకున్నా తెలంగాణలో దత్తాత్రేయను రాజకీయాలకు అతీతంగా గౌరవిస్తారు. రాజకీయాలకు అతీతంగా ఆయన నిర్వహించే అలయ్ బలయ్ కార్యక్రమానికి అందరూ హాజరవుతారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేవారు ఆయన నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మేం తీసుకునే నిర్ణయాల్లో పీజేఆర్, దత్తాత్రేయ స్ఫూర్తి కచ్చితంగా ఉంటుంది..అని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.