గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్..వారికి ఉచిత ఇసుక సరఫరా
ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత ఇసుక పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
By Knakam Karthik Published on 10 Feb 2025 9:17 PM IST
గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్..వారికి ఉచిత ఇసుక సరఫరా
ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత ఇసుక పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గనులు, ఖనిజాభివృద్ధి శాఖపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. సామాన్య వినియోగదారులకు కూడా తక్కువ ధరకు ఇసుక లభించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని అధికారులను ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు. బ్లాక్ మార్కెట్ను అరికట్టి పేదలకు ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించారు. అధికారులు ఇసుక రీచ్ల వద్ద వెంటనే తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇసుక రవాణా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలని సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల వారీగా కలెక్టర్లు, ఎస్పీలకు బాధ్యతలు అప్పగించాలని ఆదేశించారు.
హైదరాబాద్ పరిసరాల్లో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసే బాధ్యత హైడ్రాకు సీఎం రేవంత్ అప్పగించారు. ఇసుక అక్రమ రవాణాపై విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ నిఘా ఏర్పాటు చేయాలని, ప్రతి ఇసుక రీచ్ల వద్ద 360 డిగ్రీల కెమెరాలు, సోలార్ లైట్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇసుక స్టాక్ యార్డుల వద్ద కట్టుదిట్టమైన ఫెన్సింగ్తో పాటు ఎంట్రీ, ఎగ్జిట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. రవాణాకు సంబంధించి రిజిస్టర్డ్ లారీలను ఎం ప్యానెల్ చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇసుక బుక్ చేసిన 48 గంటల్లో వినియోగదారుడికి చేరేలా చర్యలు తీసుకోవాలని, ఏరియాల వారీగా సమీప ఇసుక రీచ్ల నుంచి వినియోగదారుడికి ఇసుక చేరేలా విధానం ఉండాలని సీఎం చెప్పారు.
వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేయాలని, సమస్య వచ్చిన వెంటనే పరిష్కారం జరిగేలా చూడాలని చెప్పారు. నిర్ణీత ధరకు మాత్రమే ఇసుక అమ్మకాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని, ఇసుక రవాణా చేసే వాహనాలకు ట్రాకింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేసి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని సీఎం ఆదేశించారు. ఆన్లైన్ బుకింగ్ విధానంలో పలు మార్పులను కూడా సీఎం రేవంత్ సూచించారు. కార్యాలయ పని వేళల్లో ఇసుక బుకింగ్ చేసుకునేలా మార్పు చేయాలని సూచించారు. అక్రమ రవాణాకు సహకరించే అధికారులపై వేటు తప్పదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. అక్రమ రవాణాకు పాల్పడిన వారు ఎవరైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అవసరమైతే తానే స్వయంగా ఆకస్మిక తనిఖీలు చేస్తానని హెచ్చరించారు. పారదర్శకంగా అక్రమాలకు తావు లేకుండా పర్మినెంట్ ఉద్యోగులకు బాధ్యతలు అప్పగించాలని సూచించారు.
ఇసుక అక్రమ రవాణాను అరికట్టడానికి సంబంధించి ముఖ్యమంత్రి @revanth_anumula గారు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపాలని, రీచ్ల వద్ద వెంటనే తనిఖీలు చేపట్టాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అక్రమ రవాణాకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.… pic.twitter.com/967IbIWD9J
— Telangana CMO (@TelanganaCMO) February 10, 2025