ఇచ్చిన హామీల మేరకు గ్యారంటీలను అమలు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు 26 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేశారని, 8 లక్షల కుటుంబాలు రూ.500 సిలిండర్ అందుకున్నాయని తెలిపారు. 42 లక్షల కుటుంబాలు 200 యూనిట్ల విద్యుత్ పథకాన్ని పొందాయని తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కేసీఆర్ నాశనం చేశారని, వాహన రిజిస్ట్రేషన్లో బీఆర్ఎస్కు నకలుగానే టీఎస్ తీసుకొచ్చారని సీఎం రేవంత్ ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక 100 రోజుల్లో ప్రజాపాలన అందించామని సీఎం రేవంత్ అన్నారు. ప్రజలు స్వేచ్ఛ కోరుకొని కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారని ఆయన అన్నారు.
గతంలో అభివృద్ధి, సంక్షేమం పేరుతో కేసీఆర్ రాచరిక పాలన చేశారని, ప్రజలు నిరసనలు చేయకుండా అడ్డుకున్నారని సీఎం దుయ్యబట్టారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ నిర్బంధానికి గురైందని సీఎం అన్నారు. నియంత ఎప్పుడూ సంస్కృతిని ధ్వంసం చేయాలని చూస్తాడని చురకలంటించారు. 1948 సెప్టెంబర్ 17కు ఎంతో ప్రాముఖ్యత ఉందో, 2023 డిసెంబర్ 3కు కూడా చరిత్రలో అంతే ప్రాముఖ్యత ఉందన్నారు. 1948 సెప్టెంబర్ 17న నిజాం రాచరిక పాలన అంతమైందని, 2023 డిసెంబర్ 3న కేసీఆర్ పాలన అంతమైందని చురకలంటించారు. జయ జయహే తెలంగాణ పాటను కెసిఆర్ రాష్ట్రగీతంగా ఎందుకు గుర్తించలేదని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చిన తరువాత కవులు, కళాకారులు గడిల్లో దాక్కొవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.