తెలంగాణ విధానాలు దేశానికి దిశానిర్దేశం చేస్తున్నాయి: సీఎం రేవంత్

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలు, అనుసరిస్తున్న విధానాలు దేశానికి దిశానిర్దేశం చేస్తున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.

By అంజి
Published on : 10 May 2025 8:24 AM IST

CM Revanth Reddy, Telangana government policies, country, Telangana

తెలంగాణ రైజింగ్.. దేశానికి దిశానిర్దేశం చేస్తోంది: సీఎం రేవంత్

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలు, అనుసరిస్తున్న విధానాలు దేశానికి దిశానిర్దేశం చేస్తున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. సామాజిక న్యాయంతో పాటు ఇతర అంశాల్లో తెలంగాణ మాడల్‌ను కేంద్ర ప్రభుత్వం కూడా అనుసరించాల్సిన పరిస్థితి ఉందన్నారు. ది హిందూ పత్రిక నిర్వహించిన ఓ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని పలు ప్రశ్నలకు విడమరిచి సమాధానాలిచ్చారు. పెట్టుబడుల కోసం ప్రపంచ దేశాలు చైనా ప్లస్ వన్.. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్న తరుణంలో దానిని అందిపుచ్చుకోవాలన్న ఆలోచనతో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్టు వివరించారు. రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాల అమలుతో పాటు అభివృద్ధి ప్రణాళికతో ముందుకు వెళుతున్నామని వాటిని సమగ్రంగా తెలియజేశారు.

“మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మా ప్రభుత్వం విద్య, ఉపాధి, మౌలిక సదుపాయాల కల్పనా రంగాలపై దృష్టి సారించింది. అందులో భాగంగా అనేక వినూత్న ప్రణాళికలకు శ్రీకారం చుట్టాం. ప్రపంచ దేశాల్లోని అగ్రగామి నగరాలతో పోటీ పడాలన్నదే మా ఆలోచన. అందులో భాగంగానే నెట్ జీరో సిటీకి ప్రణాళికలు సిద్దం చేశాం. దేశంలోనే మొట్టమొదటిదిగా ఫ్యూచర్ సిటీకి రూపకల్పన చేశాం. ఎలక్ట్రిక్ వాహనాలపై పన్ను రద్దు చేశాం. 360 కి.మీ మేరకు రీజినల్ రింగ్ రోడ్డు నిర్మించడమే కాకుండా తెలంగాణలో ప్రాంతాల వారిగా పారిశ్రామికీకరణకు సన్నద్ధమయ్యాం.

రీజినల్ రింగ్ రోడ్డు లోపలి పరిధిలో పారిశ్రామిక పార్కులు, ఐటీ, ఎలక్ట్రిక్ వాహనాలు, అటోమొబైల్ ఇండస్ట్రీ, ఇతర పరిశ్రమలను ఆకర్షించే విధంగా మౌలిక సదుపాయాల కల్పించాలన్నదే ప్రయత్నం. డ్రైపోర్టు నిర్మాణం వంటి అనేక ప్రణాళికలకు రూపకల్పన చేశాం. రాష్ట్రానికి 2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను సాధించాం. ఇవన్నీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు బలం చేకూర్చుతాయి. మా ప్రభుత్వం సహేతుకమైన ప్రణాళికలతో పెట్టుబడులను ఆకర్షించేందుకు, పరిశ్రమలు, ఐటీ కంపెనీలు, ఇతర రంగాలను ప్రోత్సహించేందుకు కృషి చేస్తుంది.

ప్రతి అంశాన్ని అందిపుచ్చుకుంటూ ముందుకు వెళ్లాలన్నదే ప్రయత్నం. ఇటీవల జపాన్ దేశ పర్యటన సందర్భంగా తెలుసుకున్న విషయాల మేరకు ఆ దేశానికి అవసరమైన మానవ వనరులను సమకూర్చడానికి వీలుగా తెలంగాణలో జపనీస్ భాషను నేర్పించాలని సంకల్పించాం. తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య ఉద్యోగ, రాజకీయ సర్వే దేశానికి ఒక మోడల్‌గా నిలిచింది. ఈ సర్వే సమాజాన్ని మరింత సమర్థవంతంగా గుర్తించి సేవలు అందించడంలో దోహదపడుతుంది. ఇది కేవలం బీసీల కోసమే కాదు. ఈ సర్వే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్ ప్రజలకూ ఉపయోగపడుతుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు తెలంగాణ ముందడుగు వేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ మాడల్‌ను అమలు చేయాలి. ఈ రకంగా అనేక కోణాల్లో తెలంగాణ రైజింగ్ మొదలైంది.

తెలంగాణలోని వేర్వేరు రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఐసొలేషన్ గా సాగుతున్న విద్యను ఇంటిగ్రేట్ చేయడం ద్వారా పిల్లల్లో సోషలైజేషన్ ప్రక్రియకు చేపట్టాం. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఒక కీలకమైన నిర్ణయం. జనాభాలో దాదాపు 60 శాతమున్న వ్యవసాయ కుటుంబాలకు అండగా ఉండేందుకు అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనే రాష్ట్రంలో 25 లక్షలకు పైగా రైతులకు 21,617 కోట్ల రూపాయల మేరకు రుణమాఫీ చేశాం. రైతులకు ఏటా 12 వేలు ఇన్ పుట్ సబ్సిడీగా ఇస్తున్నాం. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. దేశంలోనే అత్యధికంగా వరి ఉత్పత్తి చేసే రాష్ట్రం కనీస మద్దతు ధరతో పాటు క్వింటాల్ కు రూ. 500 బోనస్ చెల్లిస్తున్నాం.

అలాగే 67 లక్షల సభ్యులున్న స్వయం సహాయక సంఘాల మహిళలకు వెయ్యి మెగావాట్ల సోలార్ ఉత్పత్తిని అవకాశం, పాఠశాలల నిర్వహణ, యూనిఫామ్ వంటి బాధ్యతలన్నీ వారికే అప్పగించాం. ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం. అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనే 59 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. నిరుద్యోగ యువతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ అనేక నిర్ణయాలు తీసుకున్నాం. స్కిల్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, టాటా టెక్నాలజీస్ సహకారంతో రాష్ట్రంలోని 105 ఐటీఐలను ఏటీసీలుగా మార్చుతున్నాం. ఇవన్నీ యువతకు ఉద్యోగ అవకాశాలు, ఉపాధి మార్గాలను చూపించడంలో భాగంగా చేపట్టాం.

డీలిమిటేషన్‌కు మేం వ్యతిరేకం కాదు. కానీ ముందు కేంద్ర ప్రభుత్వం ఆ ప్రక్రియకు సంబంధించి అన్ని పార్టీలతో సంప్రదింపులు జరిపి అందుకు ప్రాతిపదికను స్పష్టంగా వెల్లడించాలి. అన్ని రాష్ట్రాలకు సమన్యాయం కావాలన్నదే మా డిమాండ్. అభివృద్ధి సాధిస్తున్న రాష్ట్రాలను శిక్షించకూడదు. ఇది సామాజిక, రాజకీయ న్యాయానికి సంబంధించిన అంశం. అందుకే చర్చ జరగాలని అడుగుతున్నాం” అని అన్నారు.

ఈ కార్యక్రమంలో తొలుత ముఖ్యమంత్రి మాట్లాడుతూ, “మొదటగా నేను భారతీయ సైన్యానికి సెల్యూట్ చేస్తున్నాను. దేశాన్ని రక్షించడంలో అహర్నిశలు కృషి చేస్తున్నారు. దేశ రక్షణ కోసం నిరంతరం కాపలాకాస్తోంది. ఈ సమయంలో అందరం సైనికులకు మద్దతు తెలపాలి” అని పిలుపునిచ్చారు.

Next Story