వైభవంగా యాదగిరీశుడి బ్రహ్మోత్సవాలు.. పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం
యాదగిరిగుట్టలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో సీఎం రేవంత్రెడ్డి దంపతులు పాల్గొన్నారు.
By అంజి Published on 11 March 2024 11:46 AM IST
వైభవంగా యాదగిరీశుడి బ్రహ్మోత్సవాలు.. పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం
యాదగిరిగుట్టలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో సీఎం రేవంత్రెడ్డి దంపతులు పాల్గొన్నారు. సోమవారం ఉదయం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, కొండా సురేఖ, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో కలిసి సీఎం ఆలయానికి వెళ్లారు. లక్ష్మీనరసింహా స్వామికి సీఎం రేవంత్ రెడ్డి దంపతులు, మంత్రి కొండా సురేఖ పట్టు వస్త్రాలు సమర్పించారు. వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో మంత్రుల బృందంతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి దర్శనానికి వెళ్లిన సీఎం, మంత్రులకు అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. సీఎం రేవంత్, గీత దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు వారికి వేదాశీర్వచనం పలికారు.
నేటి నుంచి 21 తేదీ వరకు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు
- 11వ తేదీ ఉదయం విశ్వక్సేన ఆరాధన, స్వస్తీ వాచనం, రక్షాబంధనం, సాయంత్రం మృత్సంగ్రహణం, అంకురారోపణ
- 12న ఉదయం అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం, సాయంత్రం భేరీపూజ, దేవతాహ్వానం
- 13న అలంకార, వాహన సేవలు ప్రారంభం. ఉదయం మత్స్య అలంకారం, సాయంత్రం శేష వాహనం సేవ
- 14న ఉదయం వటపత్రశాయి అలంకార సేవ, రాత్రి హంస వాహన సేవ
- 15న ఉదయం మురళీ కృష్ణుడి అలంకారం, రాత్రి పొన్న వాహన సేవ
- 16న ఉదయం గోవర్థనగిరిధారి అలంకారం, రాత్రి సింహ వాహన సేవ
- 17న ఉదయం జగన్మోహిన అలంకారం, రాత్రి స్వామి, అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం
- 18న శ్రీరామ అలంకారంలో హనుమంత వాహనంపై శ్రీస్వామివారి ఊరేగింపు.రాత్రి గజవాహన, శ్రీస్వామి, అమ్మవార్ల తిరు కల్యాణం నిర్వహిస్తారు.
- 19న ఉదయం శ్రీమహావిష్ణు అలంకార సేవ, గరుఢ వాహనంసేవ, రాత్రి దివ్య విమాన రథోత్సవం.
- 20న ఉదయం మహా పూర్ణాహుతి, చక్రతీర్థ స్నానం, దోపు ఉత్సవాలు
- 21న ఉదయం అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రి శృంగార డోలోత్సవంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి.