తెలంగాణ శాసన మండలికి చారిత్రక హంగులు..పాత అసెంబ్లీ భవనాన్ని ప్రారంభించిన సీఎం

తెలంగాణ శాసనసభ ప్రాంగణంలోని చారిత్రక పాత అసెంబ్లీ భవనం సరికొత్త హంగులతో పునరుద్ధరించబడింది.

By -  Knakam Karthik
Published on : 8 March 2026 3:40 PM IST

Hyderabad, Telangana Legislative Council, CM RevanthReddy, Heritage Restoration, Old Assembly Building

తెలంగాణ శాసన మండలికి చారిత్రక హంగులు..పాత అసెంబ్లీ భవనాన్ని ప్రారంభించిన సీఎం

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో తెలంగాణ శాసనసభ ప్రాంగణంలోని చారిత్రక పాత అసెంబ్లీ భవనం సరికొత్త హంగులతో పునరుద్ధరించబడింది. నిజాం కాలం నాటి ఇండో-సార్సెనిక్ వాస్తుశైలిలో నిర్మితమైన ఈ హెరిటేజ్ కట్టడాన్ని ఆదివారం నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మరియు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌లతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఇకపై ఈ భవనం శాసన మండలి (లెజిస్లేటివ్ కౌన్సిల్) కార్యకలాపాలకు వేదిక కానుంది. గతంలో ఉమ్మడి ఏపీ అసెంబ్లీగా సేవలందించిన ఈ భవనం, రాష్ట్ర విభజన తర్వాత కొంతకాలం నిరుపయోగంగా మారి శిథిలావస్థకు చేరినప్పటికీ, ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ (AKTC) సహకారంతో రూ. 30 కోట్ల వ్యయంతో 18 నెలల పాటు శ్రమించి దీనిని పునరుద్ధరించారు.

ఈ పునర్నిర్మాణంలో భాగంగా ప్రాచీన వైభవం దెబ్బతినకుండా అధునాతన డ్రైనేజీ, ఎలక్ట్రికల్ వ్యవస్థలు, మరియు సుందరమైన ఫ్లోరింగ్‌ను ఏర్పాటు చేశారు. సీఎం, ఛైర్మన్, వైస్ ఛైర్మన్ కోసం ప్రత్యేక ఛాంబర్లతో పాటు అత్యాధునిక మీడియా హాల్‌ను కూడా ఇక్కడ సిద్ధం చేశారు. రాబోయే బడ్జెట్ సమావేశాలు ఈ కొత్త భవనంలోనే జరగనుండటం విశేషం. 2018 నుండి జూబ్లీహాల్‌లో సాగుతున్న మండలి సమావేశాలు ఇకపై ఇక్కడికి మారనుండటంతో, జూబ్లీహాల్‌ను కేవలం ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకే పరిమితం చేయనున్నారు. అసెంబ్లీ మరియు కౌన్సిల్ రెండూ ఒకే ప్రాంగణంలో ఉండటం వల్ల పాలనాపరమైన సౌలభ్యం కలగడమే కాకుండా, భవిష్యత్తులో ఉభయ సభల సంయుక్త సమావేశాల కోసం ఒక కొత్త సెంట్రల్ హాల్ నిర్మించే యోచనలో కూడా ప్రభుత్వం ఉంది. పార్లమెంట్ తరహాలో ఎంతో హుందాగా తీర్చిదిద్దబడిన ఈ భవనం తెలంగాణ శాసన వ్యవస్థకు ఒక మకుటంగా నిలవనుంది.

Next Story