2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్
తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగంలో ఈరోజు చారిత్రక మైలురాయిగా నిలిచిపోతుంది..అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik
2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్
తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగంలో ఈరోజు చారిత్రక మైలురాయిగా నిలిచిపోతుంది..అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎలీ లిల్లీ(Eli Lilly) గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే చేసిన ప్రయత్నాల ఫలితంగానే ఈ రోజు హైదరాబాద్ నగరం ప్రపంచ స్థాయి గ్లోబల్ జీసీసీ రాజధానిగా ఎదిగింది. ఇందుకు ఇవాళ్టి ఈ కార్యక్రమమే తిరుగులేని నిదర్శనం. మా ప్రభుత్వ చిత్తశుద్ధి, దృష్టికోణం, కృషి ఫలితంగానే ఇది సాధ్యమైంది. ఈ విజయం సాధించడంలో అహర్నిశలు శ్రమించిన మంత్రి శ్రీధర్ బాబుకి, జయేష్ రంజన్ కి, పాలుపంచుకున్న అధికారులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఇది తెలంగాణ రైజింగ్ దిశగా మేము వేసిన మరొక ముఖ్యమైన అడుగు. తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ ఎకానమిగా తీర్చి దిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దుతాం. ఎలీ లిల్లీ (Eli Lilly) సంస్థ లీడర్ షిప్ను, ఉద్యోగులను హైదరాబాద్ నగరానికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాను..అని సీఎం అన్నారు.
తెలంగాణపై నిరంతర నమ్మకం ఉంచి, అండగా నిలిచి అన్ని విధాలుగా మద్దతు ఇస్తున్నందుకు పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, ప్రపంచ శ్రేణి కార్పొరేషన్లకు, కంపెనీలకు ధన్యవాదాలు. ఈ రోజు ప్రారంభమైన ఎలీ లిల్లీ నూతన కేంద్రం… ఆ సంస్థ గ్లోబల్ కార్యకలాపాలను మరింత వేగవంతం చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ టెక్నాలజీ, ఇన్నొవేషన్ సెంటర్, ప్రపంచవ్యాప్తంగా రోగులకు పరిష్కారాల కోసం పరిశోధనలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎలీ లిల్లీ సంస్థను హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేయడమంటే ఈ నగరం ఘనతను మీరు ప్రపంచానికి చాటి చెప్పినట్లే. హైదరాబాద్ నగరంలో టాలెంట్ ఉంది, లీడర్షిప్ ఉంది, విజన్ ఉంది, మంచి పాలసీ ఉంది, మౌలిక సదుపాయాలు ఉన్నాయి.
అందుకే ఎలీ లిల్లీ లాంటి గ్లోబల్ లీడర్కు ఇది అనుకూలమైన కేంద్రంగా మారింది. భారతదేశ లైఫ్ సైన్సెస్ రాజధానిగా హైదరాబాద్ ఇప్పటికే గుర్తింపు పొందింది. 2000కు పైగా లైఫ్ సైన్సెస్ కంపెనీలు ఇక్కడ ఉన్నాయి. 200కి పైగా ప్రఖ్యాత అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్ నగరం నుంచి తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. భారత్లో ఫార్మాస్యూటికల్ ఉత్పత్తిలో సుమారు 40 శాతం తెలంగాణలోనే జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న ప్రతి 3 టీకాలలో ఒకటి హైదరాబాద్లో అభివృద్ధి చేయడం లేదా తయారవుతుండటం మాకు గర్వకారణం. హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీ, భారతదేశంలోని అతిపెద్ద లైఫ్ సైన్సెస్ పరిశోధన- అభివృద్ధి సముదాయంగా నిలిచింది. ప్రపంచంలోని అగ్రశ్రేణి ఫార్మాస్యూటికల్, బయోటెక్నాలజీ సంస్థల కోసం హైదరాబాద్ అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రపంచ గమ్యస్థానంగా మారింది. ఈరోజు, ఎలీ లిల్లీ సంస్థ రాకతో, లైఫ్ సైన్సెస్ రంగంలో మేము మరో మెట్టుకు చేరుకున్నాం. మధుమేహం, ఆంకాలజీ, ఇమ్యునాలజీ, న్యూరోసైన్స్ రంగాలలో ఎలీ లిల్లీ సంస్థ కృషి ఒక గేమ్-ఛేంజర్ గా నిలిచిపోతుంది..అని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.