గురుకుల విద్యార్థినికి అండగా సీఎం రేవంత్ రెడ్డి

గురుకుల పాఠశాల భవనంపై నుంచి కిందపడి తీవ్రగాయాలపాలైన విద్యార్థిని కొయ్యడ కార్తీకకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండగా నిలిచారు.

By అంజి  Published on  14 Aug 2024 1:45 AM GMT
Cm Revanth Reddy, Mulugu, Gurukula Student, Treatment, NIMS

గురుకుల విద్యార్థినికి అండగా సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: గురుకుల పాఠశాల భవనంపై నుంచి కిందపడి తీవ్రగాయాలపాలైన విద్యార్థిని కొయ్యడ కార్తీకకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండగా నిలిచారు. ప్రభుత్వ ఖర్చుతో వైద్యం అందించాలని ఆయన సీఎం కార్యాలయ అధికారులను ఆదేశించారు. సీఎం సూచన మేరకు హైదరాబాద్ నిమ్స్ లో కార్తీకకు వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. ప్రస్తుతం ఆ విద్యార్థిని కోలుకుంటోంది.

ములుగు జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న కార్తీక ఈ నెల 9న ప్రమాదవశాత్తు స్కూల్ మూడో అంతస్తు నుంచి కిందపడిపోయింది. దీంతో నడుము భాగంలో తీవ్రగాయాలయ్యాయి. గురుకుల అధికారులు విద్యార్థినిని తొలుత వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి కి, అక్కడి నుంచి హైదరాబాద్ నిమ్స్ కు తరలించారు.

నిమ్స్ న్యూరో సర్జన్ అసిస్టెంట్ ఫ్రొఫెసర్ డాక్టర్ తిరుమల్ బృందం మంగళవారం నాడు కార్తీకకు ఆపరేషన్ నిర్వహించింది. ప్రస్తుతం ఐసీయులో విద్యార్థిని కోలుకుంటున్నట్లు డాక్టర్లు తెలిపారు. కార్తీక కు కావాల్సిన వైద్యం ఖర్చులను పూర్తిగా ప్రభుత్వమే భరించనున్నది. ముఖ్యమంత్రి కార్యాలయం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు.. నిమ్స్ డైరెక్టర్ బీరప్పతో మాట్లాడి కార్తీక కోలుకునేంత వరకు వైద్యం అందించాలని సూచించారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క కూడా కార్తీక ఆరోగ్య పరిస్థితిపైన ఎప్పటికప్పుడు నిమ్స్ డాక్టర్లను అడిగి తెలుసుకుంటున్నారు.

Next Story