మేడారం, బాసర ఆలయాల అభివృద్ధిపై సీఎం కీలక ఆదేశాలు
మేడారం, బాసర ఆలయాల అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
By Knakam Karthik
మేడారం, బాసర ఆలయాల అభివృద్ధిపై సీఎం కీలక ఆదేశాలు
హైదరాబాద్: మేడారం, బాసర ఆలయాల అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మేడారం, బాసర ఆలయాల అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ను అధికారులు సీఎంకు వివరించారు. మేడారం మహాజాతర నాటికి భక్తులకు సౌకర్యంగా ఉండేలా ఆలయాన్ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. 100 రోజుల్లో మేడారం అభివృద్ధి పనులు పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మేడారం అభివృద్ధికి సంబంధించి పలు డిజైన్లను పరిశీలించిన సీఎం..పూర్తిగా సహజసిద్ధమైన రాతి కట్టడాలతో నిర్మాణాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. భక్తులకు సౌకర్యంగా ఉండేలా ఎంట్రీ, ఎగ్జిట్, పార్కింగ్ వసతులు ఉండాలన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని జంపన్న వాగులో నీరు నిలిచేలా ఏరియాలవారీగా చెక్ డ్యామ్ల నిర్మాణాలకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
కాగా ఈ వారంలో మేడారంకు వచ్చి క్షేత్రస్థాయి పరిశీలన చేస్తానని సీఎం రేవంత్ అధికారులకు తెలిపారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచించారు. మరో వైపు బాసర జ్ఞాన సరస్వతీ దేవాలయ విస్తరణ, అభివృద్ధికి సంబంధించిన పలు సూచనలు చేశారు. అన్ని దేవాలయాల అభివృద్ధికి సంబంధించి స్థానిక సెంటిమెంట్ ను గౌరవించడంతోపాటు, స్థానిక నిపుణులు, పూజారుల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.