గుల్జార్​హౌజ్​ అగ్ని ప్రమాదంపై విచారణకు.. సీఎం రేవంత్‌ ఆదేశం

హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని గుల్జార్​హౌజ్​లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విచారణకు ఆదేశించారు.

By అంజి
Published on : 19 May 2025 7:15 AM IST

CM Revanth, Gulzar House, fire accident, Hyderabad

గుల్జార్​హౌజ్​ అగ్ని ప్రమాదంపై విచారణకు.. సీఎం రేవంత్‌ ఆదేశం 

హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని గుల్జార్​హౌజ్​లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విచారణకు ఆదేశించారు. ఈ ప్రమాదానికి దారి తీసిన అసలైన కారణాలను లోతుగా దర్యాప్తు చేయాలని ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా నివారణ చర్యలను చేపట్టాలని, ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. మంటల్లో చిక్కుకున్న వారిలో 17 మంది మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు. చనిపోయిన వారికి సంతాపం ప్రకటించారు. వారి కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.

ప్రమాదం సమాచారం తెలిసిన వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి అగ్నిమాపక శాఖ, పోలీసు అధికారులతో ఎప్పటికప్పుడు ఫోన్​లో మాట్లాడి సహాయక చర్యలను పర్యవేక్షించారు. సహాయక చర్యలను వేగవంతం చేయటంతో పాటు బాధితులకు మెరుగైన వైద్య సాయం అందించేందుకు అందుబాటులో ఉన్న మంత్రులు, అధికారులు వెంటనే ఘటన స్థలానికి వెళ్లాలని సీఎం ఆదేశించారు. సంఘటన స్థలానికి వెళ్లిన మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఐజీ నాగిరెడ్డితో ఫోన్ లో మాట్లాడి గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేలా ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశారు.

అక్కడున్న బాధిత కుటుంబీకులతో కూడా ముఖ్యమంత్రి నేరుగా ఫోన్ లో మాట్లాడారు. ప్రభుత్వం తరఫున తప్పకుండా ఆదుకుంటామని వారికి భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఫైర్​ సిబ్బంది సకాలంలో స్పందించటంతో భారీ ప్రాణనష్టం తప్పిందని, అగ్నిమాపక సిబ్బంది కొంత మందిని ప్రాణాపాయ స్థితి నుంచి సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారని ముఖ్యమంత్రి అన్నారు. మంటల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఫైర్​ టీమ్​ తమ శక్తి యుక్తులు ప్రదర్శించిందన్నారు.

Next Story