రాష్ట్రంలో మొంథా తుపాన్ ప్రభావంపై అధికారులను ఆరాతీసిన సీఎం రేవంత్

మొంథా తుపాన్ ప్రభావంపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికారులను ఆరా తీశారు.

By -  Knakam Karthik
Published on : 29 Oct 2025 4:03 PM IST

Telangana, MonthaCyclone, WeatherAlert, TelanganaRains, CM Revanthreddy

రాష్ట్రంలో మొంథా తుపాన్ ప్రభావంపై అధికారులను ఆరాతీసిన సీఎం రేవంత్

హైదరాబాద్: మొంథా తుపాన్ ప్రభావంపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికారులను ఆరా తీశారు. వరి కోతల సమయం కావడంతో పాటు పలు చోట్ల కళ్లాల్లో ధాన్యం ఆరబోసిన నేపథ్యంలో రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాల్లోనూ తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో మొంథా తుపాన్ ప్రభావం అధికంగా ఉండగా, హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తుండడంతో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ జంక్షన్‌లో గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌, గుండ్రాతిమడుగు స్టేషన్‌లో కోణార్క్ ఎక్స్‌ప్రెస్ నిలిచిపోవడంతో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అధికారులు దారి మళ్లించిన నేపథ్యంలో ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని చెప్పారు. తుపాన్ ప్రభావం అధికంగా ఉన్న జిల్లాల్లో ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సమన్వయంతో పనిచేయాలని, జిల్లా కలెక్టర్లు ఆయా బృందాలకు తగిన మార్గదర్శకత్వం వహించాలని సూచించారు. వాగులు, వంకలు పొంగే ప్రమాదం ఉన్నందున జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండి, లోతట్టు ప్రాంతాల కుటుంబాలను సహాయక శిబిరాలకు తరలించాలన్నారు.

నీటి పారుదల శాఖ అధికారులు, సిబ్బంది రిజర్వాయర్లు, చెరువులు, కుంటల నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, నీటి విడుదలపై ముందుగానే కలెక్టర్లకు మరియు క్షేత్రస్థాయి సిబ్బందికి సమాచారం ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. పూర్తిగా నిండిన చెరువులు, రిజర్వాయర్ల వద్ద ఇసుక బస్తాలను ముందుగానే సిద్ధంగా ఉంచాలన్నారు. రోడ్లపై నీరు నిలిచిన ప్రాంతాల్లో, లో లెవల్ బ్రిడ్జీలు, కాజ్‌వేలపై నుంచి రాకపోకలను పూర్తిగా నిషేధించాలని, పోలీసులు, రెవెన్యూ అధికారులు వాటి సమీపంలో బారికేడ్లు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.

తుపాన్ ప్రభావంతో వర్షపు నీరు నిలువ ఉండి దోమలు, ఇతర క్రిమికీటకాలు విజృంభించే అవకాశం ఉన్నందున నగర, పురపాలక, గ్రామ పారిశుద్ధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు. వైద్యారోగ్య శాఖ తగినంత మందులు అందుబాటులో ఉంచుకోవాలని, అవసరమైన చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రాణనష్టం, ఆస్తినష్టం, పశునష్టం చోటుచేసుకోకుండా అన్ని శాఖలు జాగ్రత్తలు వహించాలన్నారు. రెవెన్యూ, విద్యుత్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, వైద్యారోగ్య, పోలీస్, అగ్నిమాపక శాఖలు, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సమన్వయంతో పని చేయాలని ముఖ్యమంత్రి గారు సూచించారు. హైదరాబాద్ నగరంలో ప్రజల నుంచి వచ్చే వినతులకు GHMC, HYDRAA, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక శాఖ సిబ్బంది తక్షణమే స్పందించాలని ఆదేశించారు

Next Story