సీఎం కేసీఆర్ కొండగట్టు పర్యటన వాయిదా

CM KCR's visit to Kondagattu postponed. సీఎం కేసీఆర్ ఫిబ్రవరి 14న కొండగట్టు పుణ్యక్షేత్రాన్ని సందర్శించాలనుకున్నారు.

By Medi Samrat  Published on  13 Feb 2023 1:37 PM GMT
సీఎం కేసీఆర్ కొండగట్టు పర్యటన వాయిదా

సీఎం కేసీఆర్ ఫిబ్రవరి 14న కొండగట్టు పుణ్యక్షేత్రాన్ని సందర్శించాలనుకున్నారు. అయితే కొండగట్టు పర్యటన వాయిదా పడింది. కేసీఆర్ తన పర్యటనను ఎల్లుండికి మార్చుకున్నారు. మంగళవారం కొండగట్టులో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందన్న కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆలయ పునర్ నిర్మాణం కోసం క్షేత్రస్థాయిలో ఆలయాన్ని పరిశీలించనున్నారు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే మంగళవారం రోజున ఆలయ పర్యటన ఇబ్బందికరంగా ఉంటుందని సీఎంవో భావించింది. సీఎం రాకతో భక్తులకు అసౌకర్యం కలగకూడదనే ఈ పర్యటన వాయిదా నిర్ణయం తీసుకున్నారు. యాదాద్రి తరహాలోనే ఈ పుణ్యక్షేత్రాన్ని కూడా తీర్చిదిద్దనున్నారు.

కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయాన్ని ఆగమశాస్త్రం ప్రకారం యాదాద్రి తరహాలో అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్‌ చర్యలు తీసుకుంటున్నారని వాస్తు సలహాదారు, ఆర్కిటెక్ట్‌ ఆనంద్‌ సాయి వెల్లడించారు. ఇటీవల కలెక్టర్‌ యాస్మిన్‌ బాషా, ఎస్పీ భాస్కర్, ఇతర అధికారులు, నాయకులతో సమావేశమై ఆలయ మాస్టర్‌ప్లాన్‌పై చర్చించారు. ఆలయంలో ఇప్పుడున్న ప్రాకారంతో పాటు మరో దానిని నిర్మించాల్సి ఉందన్నారు. పుణ్యక్షేత్రంలో 1980 నాటి భవనాలు ఉన్నాయని, గర్భగుడిలోని స్వామివారు భక్తులకు కనిపించడంలేదని చెప్పారు. ఆలయంలో 108 అడుగుల పొడవైన ఆంజనేయస్వామి విగ్రహం ఏర్పాటు చేయాలని సీఎం యోచిస్తున్నారని పేర్కొన్నారు.


Next Story