నేడు ముంబైకి సీఎం కేసీఆర్‌.. మహారాష్ట్ర సీఎంతో భేటీ

CM KCR to meet Maharashtra CM Uddhav Thackeray in Mumbai today. గత కొద్ది రోజులుగా బీజేపీపైనా, ప్రధాని నరేంద్ర మోదీపైనా తీవ్ర విమర్శలు చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ

By అంజి  Published on  20 Feb 2022 4:09 AM GMT
నేడు ముంబైకి సీఎం కేసీఆర్‌.. మహారాష్ట్ర సీఎంతో భేటీ

గత కొద్ది రోజులుగా బీజేపీపైనా, ప్రధాని నరేంద్ర మోదీపైనా తీవ్ర విమర్శలు చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారు. ఈ దిశగా మరో కీలక అడుగు వేయనుంది. ఇందులో భాగంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదివారం ముంబై వెళ్లనున్నారు. ఆదివారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో కేసీఆర్ ముంబైకి చేరుకుంటారు. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో ఆయన నివాసంలో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌తో పాటు ఆయన బృందం ఉద్ధవ్ ఠాక్రేతో కలిసి భోజనం చేయనున్నారు.

మధ్యాహ్న భోజనం అనంతరం ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసానికి వెళ్లి జాతీయ రాజకీయ అంశాలపై చర్చించనున్నారు. అనంతరం సాయంత్రం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు. కాగా, సీఎం కేసీఆర్ తో పాటు మంత్రి హరీశ్ రావు కూడా ముంబై వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ముంబై టూర్ ముగించుకుని కేసీఆర్ కర్ణాటక వెళ్లనున్నట్లు సమాచారం. అక్కడ మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ కానున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఢిల్లీలో మమతా బెనర్జీ నిర్వహించనున్న సమావేశానికి కూడా కేసీఆర్ హాజరు కావచ్చనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. కాగా సీఎం కేసీఆర్‌ ముంబై పర్యటన నేపథ్యంలో ఆయనకు స్వాగతం పలుకుతూ భారీ ఏర్పాట్లు చేశారు. దారి పొడవునా హోర్డింగులు , సైన్ బోర్డుల ఏర్పాటు చేశారు. ఎయిర్పోర్ట్ నుంచి ఉద్ధవ్ థాకరే ఇంటి వరకు అడుగడుగునా భారీ హోర్డింగులు ఉంచారు.

Next Story