ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు శుభ‌వార్త చెప్పిన సీఎం కేసీఆర్‌

CM KCR Good News to Govt Employees. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు సీఎం కేసీఆర్ శుభ‌వార్త చెప్పారు.

By Medi Samrat  Published on  30 Dec 2020 3:54 AM GMT
ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు శుభ‌వార్త చెప్పిన సీఎం కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు సీఎం కేసీఆర్ శుభ‌వార్త చెప్పారు. కొత్త సంవ‌త్స‌రం కానుక‌గా.. అన్ని శాఖ‌ల‌ ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు వేత‌నాలు పెంచాల‌ని, ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌స్సును పెంచాల‌ని నిర్ణ‌యించారు. అంతేకాదు.. అన్ని శాఖ‌ల్లో ఉద్యోగాల భ‌ర్తీ ప్ర‌క్రియను ఫిబ్ర‌వ‌రి నుంచి చేపట్ట‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ప్రభుత్వ ఉద్యోగులు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఉద్యోగులు, వర్క్ చార్జుడ్ ఉద్యోగులు, డెయిలీ వైజ్ ఉద్యోగులు, ఫుల్ టైమ్ కాంటింజెంట్ ఉద్యోగులు, పార్ట్ టైమ్ కాంటింజెంట్ ఉద్యోగులు, హోంగార్డులు, అంగన్ వాడీ వర్కర్లు, కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఆశ వర్కర్లు, విద్యా వలంటీర్లు, సెర్ఫ్ ఉద్యోగులు, గౌరవ వేతనాలు అందుకుంటున్న వారు, పెన్షనర్లు ఇలా అందరికీ ప్రయోజనం కలిగేలా వేతనాల పెంపు చేస్తామని సీఎం ప్రకటించారు.

దీని కోసం సీఎస్ సోమేశ్‌కుమార్ నేతృత్వంలో ఓ క‌మిటీని సీఎం నియ‌మించారు. వేత‌నాల పెంపు స‌హా వివిధ అంశాల‌పై ఆ క‌మిటీ ప్ర‌భుత్వానికి నివేదిక ఇవ్వ‌నుంది. ఈ మేర‌కు సీఎం కార్యాల‌యం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. తెలంగాణలో అన్నిరకాల ఉద్యోగుల కలిపి 9,36,976 మంది ఉంటారని.. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు తక్కువ వేతనాలు కలిగిన ఉద్యోగులున్న ఆర్టీసీలో కూడా వేతనాలను పెంచాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు. ఆర్టీసీలో వేత‌నాల పెంపు వ‌ల్ల ప‌డే భారాన్ని అవ‌స‌ర‌మైతే ప్ర‌భుత్వం భ‌రిస్తుంద‌ని ప్ర‌క‌టించారు. వేతనాల పెంపుతోపాటు ఉద్యోగ విరమణ వయస్సు పెంపు, పదోన్నతులు ఇవ్వడం, అవసరమైన బదిలీలు చేయడం, సరళతరమైన సర్వీసు నిబంధనల రూపకల్పన, రిటైర్ అయ్యే రోజే ఉద్యోగులకు అన్నిరకాల ప్రయోజనాలు అందించి గౌరవంగా వీడ్కోలు పలకడం, కారుణ్య నియామకాలన్నింటినీ చేపట్టడం లాంటి ఉద్యోగ సంబంధ అంశాలన్నింటినీ ఫిబ్రవరి లోగా సంపూర్ణంగా పరిష్కరించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. అన్నిశాఖల్లో ఖాళీలను గుర్తించి ఫిబ్రవరి నుండి ఉద్యోగ నియామకాల ప్రక్రియను చేపట్టనున్నట్లు వెల్ల‌డించారు.

తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర ఎంతో గొప్పదని.. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలంగాణ ప్రాంత ఉద్యోగులు టీఎన్జీవో పేరుతో తెలంగాణ అస్తిత్వాన్ని గొప్పగా నిలుపుకున్నారని అన్నారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే తెలంగాణ ఖచ్చితంగా ధనిక రాష్ట్రం అవుతుందని అంచనా వేశాం. అప్పుడు ప్రభుత్వానికి, ప్రజలకు సేవలందిస్తున్న ఉద్యోగులకు మంచి వేతనాలు ఇవ్వవచ్చని భావించాం. అనుకున్నట్టుగానే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ ధనిక రాష్ట్రంగా మారింది. రైతుల కోసం, పేదల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఉద్యోగుల సంక్షేమం కోసం కూడా ఎన్నో చర్యలు తీసుకుంటున్నది. తెలంగాణ ఏర్పడిన వెంటనే ఉద్యోగులకు 42 శాతం ఫిట్ మెంట్ తో వేతనాలు పెంచింది. ఉద్యోగులు, పెన్షనర్లతోపాటు అన్ని ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులకు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు, కాంట్రాక్టు ఉద్యోగులకు, తక్కువ వేతనాలతో పనిచేస్తున్న ఉద్యోగులకు, మున్సిపల్, గ్రామ పంచాయతీ సిబ్బందికి వేతనాలు పెంచింది. ఇప్పుడు మరోసారి వీరందరికీ వేతనాలు పెంచాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వానికున్న ఆర్ధిక పరిమితుల మేర ప్రభుత్వానికి సేవలు అందిస్తున్న అన్నిరకాల ఉద్యోగులకు ఖచ్చితంగా ఎంతో కొంత వేతనాలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింద‌ని సీఎం ప్రకటించారు.


Next Story