రైతాంగానికి దిక్కూ, దివాణం లేరనుకోకండి.. నేను ముందుంట.. అందరినీ ఒకటి చేస్తా..

CM KCR Fire On Center. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ అనుకూల విధానాలు అవలంభిస్తూ, రైతులకు ఎన్నో పథకాలు అమలు

By Medi Samrat  Published on  12 April 2022 2:37 PM GMT
రైతాంగానికి దిక్కూ, దివాణం లేరనుకోకండి.. నేను ముందుంట.. అందరినీ ఒకటి చేస్తా..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ అనుకూల విధానాలు అవలంభిస్తూ, రైతులకు ఎన్నో పథకాలు అమలు చేస్తున్నదని సీఎం కేసీఆర్ అన్నారు. 2014-15 నుంచి 2021-22 వరకు తెలంగాణ రాష్ట్రంలో కోటి ఎకరాల సాగు విస్తీర్ణం పెరిగిందని తెలిపారు. కేంద్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం ఉండటం భారత రైతుల దురదృష్టమ‌ని అన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయమని కేంద్రాన్ని అడిగితే చేయలేదని.. ఎరువుల మీద కేంద్రం ధరలు పెంచడం దారుణమ‌ని అన్నారు. బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టాలని అంటున్నరు. వ్యవసాయరంగాన్ని బలహీన పర్చే అంతర్గత కుట్రలో ఇదంతా భాగమ‌ని ఫైర్ అయ్యారు.

రైతులకు మద్దతు ధర ఇస్తామన్నరు. ఈ రోజు వరకు అతీగతీ లేదు. దేశ రైతాంగమంతా ఈ విషయాలను గమనిస్తున్నది. తెలంగాణలో పండించిన వరిధాన్యం విషయంలో కేంద్రం వితండవాదం చేస్తూ, తలా తోక లేకుండా వ్యవహరిస్తున్నదని మండిప‌డ్డారు. నేను స్వయంగా వెళ్లిన. మంత్రులంతా వెళ్లిండ్రు. కేంద్రమంత్రి అవమాన పరుస్తూ మాట్లాడిండు. మీ రాష్ట్ర ప్రజలకు నూకలు తినుడు అలవాటు చేయండి అన్నడు. ఎంత గర్వం, ఎంత అహంకారం ఆయనకు అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

క్యా చమత్కార్ కర్ దియా తెలంగాణ.. అని నాతోనే అన్నడు. ఇంత పంట ఎలా పండింది అని అర్ధం చేసుకోలేక పోయిండు. కేంద్రం సాధించలేని గమ్యాలను తెలంగాణ సాధిస్తే, అర్ధం చేసుకోవడం లేదని పీయూష్ గోయ‌ల్‌పై మండిప‌డ్డారు. తెలంగాణలో ఈ యాసంగిలో 36 లక్షల ఎకరాల వరి పంట సాగవుతున్నది. దేశంలో ఎక్కడా ఇందులో సగం కూడా సాగు చేయడం లేదు. ఏ రాష్ట్రానికి రాని సమస్య, తెలంగాణకు ఎందుకు వస్తుందంట‌రు.. అవును వస్తది. ఎందుకంటే ఏ రాష్ట్రం వేయనంత విస్తీర్ణంలో మేం సాగు చేస్తున్నామ‌న్నారు.

ఎగుమతుల విషయంలో కూడా కేంద్రమంత్రి అబద్దాలు చెప్పార‌ని.. ఎండాకాలంలో వరిపంట వస్తది కాబట్టి, నూకల శాతం పెరుగుతది. అసలు కథ ఇదని వివ‌రించారు. వానాకాలంలో 100 కిలోల వడ్లు పండితే 65 కిలోల బియ్యం వస్తది. యాసంగిలో మాత్రం ఎండాకాలం కాబట్టి తక్కువ బియ్యం వస్తయి. ఈ నష్టం కేంద్రం భరించాలె. ఆహార భద్రత చట్టం ప్రకారం ఈ పంటను తీసుకొని, దాన్ని వితరణ చేసే సందర్భంలో నష్టం వస్తే భరించాలె. కొన్నిసార్లు ఎగుమతి చేస్తే లాభం కూడా వస్తది.. కేంద్రంలో ఉన్నది తెలివితక్కువ ప్రభుత్వమ‌ని విమ‌ర్శించారు.

కేంద్రం పన్నులు, రాష్ట్రం పన్నులు వేర్వేరుగా ఉంటాయని.. తెలంగాణ వచ్చినప్పటినుంచి పెట్రోల్, డీజిల్ పై మేం వ్యాట్ పెంచలేదని అన్నారు. కేంద్రం మాత్రం రోజుకో రూపాయి పెంచుకుంటూ పోతుందని అన్నారు. స్టేట్ ట్యాక్స్ తగ్గించాలని మళ్లీ మనల్నే అంటున్నది. ఫెడరల్ సమాఖ్యకు విరుద్ధంగా కేంద్రం వ్యవహరిస్తున్నదని విమ‌ర్శించారు. ప్రజాస్వామ్య పరిణతి పెరిగిన దేశాల్లో అధికారాల బదిలీ జరుపుతారు. కానీ ఇక్కడ బలహీనమైన కేంద్రం, బలహీనమైన రాష్ట్రాల సిద్ధాంతాన్ని పట్టుకొని వేళ్లాడుతున్నారని.. మీరు పెంచుతారు, మేం తగ్గించాలా? ఇదెక్కడి నీతి? అని ప్ర‌శ్నించారు.

ఆహార భద్రత బాధ్యత నుంచి కేంద్రం తప్పించుకుంటున్నదని.. నూకలు ఎక్కువగా వస్తే ఆ నష్టాన్ని కేంద్రం భరిస్తే సరిపోతుంది కదా.. కేంద్రానికి ఎందుకీ రాద్ధాంతం అని అన్నారు. నిన్న ఢిల్లీలో కూడా భారత ప్రజల ముందు కేంద్ర ప్రభుత్వ బాధ్యతను గుర్తు చేసినం. దోషిగా నిలబెట్టినం. నేను సూటిగా అడిగిన. ఒక రాష్ట్రంలో చిన్న విషయం ఇది. ధాన్యం కొనుగోలు నష్టాన్ని భరించేందుకు కేంద్రానికి శక్తి లేదా? ప్రధాన మంత్రి మోదీకి మనస్సు లేదా?.. బ్యాంకులను ముంచిన కార్పొరేట్ గద్దల వెనుక ఉన్నది వీళ్లు కాదా.. లండన్లో తిరుగుతున్నది వీళ్ల ఫ్రెండ్స్ కాదా? అని ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు.

కేంద్రం మొత్తం పదిన్నర లక్షల కోట్లు మాఫీ చేసిందని.. కేంద్రం ఆదానీ గ్రూపుకు 12,500 కోట్లు మాఫీ చేసిండ్లు.. పేపర్ల వచ్చింది.. రైతుల కోసం నష్టం భరించమంటే మాత్రం చేతగాదని విమ‌ర్శించారు. బియ్యాన్ని రీ సైక్లింగు చేస్తున్నదని ఒక కేంద్రమంత్రి నీచంగా మాట్లాడుతడా? రైతుల పట్ల, ప్రజల పట్ల కేంద్రం బాధ్యతారహితంగా ఉన్నదని చెప్పడానికి ఇదే నిదర్శనం అని దుయ్య‌బ‌ట్టారు. కేంద్రం ధాన్యం కొనకపోతే, దాన్ని మేం భరిస్తం. ఈ రోజు క్యాబినెట్లో ఈ విషయాన్ని సమగ్రంగా చర్చించినం అని తెలిపారు.

మేం రైతులను కోరిన మీదట 20 లక్షల ఎకరాలలో వరిపంట తగ్గించగలిగినం. అదే సమయంలో బీజేపీ రాష్ట్ర నాయకులు కేంద్రమే కొంటదని దుష్ప్రచారం చేసి, నమ్మించిండ్లు. మేం ఈ విషయంలో చిత్తశుద్ధితో వ్యవహరించినం అని తెలిపారు. 12 వేల కోట్లు ఉచిత కరంటు, 10 వేల కోట్లు రైతు బంధు, 1600 కోట్లు రైతు బీమా చేస్తున్నం.. మా రైతులకు నష్టం జరిగితే మేం చూస్తూ ఊరుకుంటమా.. మా రైతుల నష్టాన్ని తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తదని భ‌రోసా ఇచ్చారు.

ఈ యాసంగిలో పండిన వరి పంట మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనాలని క్యాబినెట్ నిర్ణయించిందని తెలిపారు. తక్కువ నష్టంతో ధాన్యం కొనేందుకు నలుగురు కార్యదర్శులతో కమిటీని వేయాలని క్యాబినెట్ నిర్ణయించిందన్నారు. 1960 రూపాయల మద్దతు ధరను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని.. రైతులెవరూ ఒక్క రూపాయి తక్కువకు కూడా ధాన్యం అమ్మవద్దని కోరారు. వారం రోజులు ఢిల్లీలో ఉన్న.. భారత మేధోవర్గం మొత్తం ఆలోచిస్తున్నదన్నారు. కేంద్రంలో ఇపుడున్న బీజేపీ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్నదని విమ‌ర్శించారు.

జీడీపీ తగ్గింది. నిరుద్యోగం పెరిగింది. నిత్యావసరాల ధరలు పెంచుతున్నది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అధికారం నిషా తలకెక్కిందని అన్నారు. మత గజ్జికి సంబంధించి చిల్లర పద్ధతుల్లో విద్వేషాలను రెచ్చగొడుతున్నదని.. శ్రీరామ నవమి రోజున కూడా ఇలాగే జరిగిందని ఆరోపించారు. ఎన్నికలు జరిగే గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో రాళ్లు వేస్తరు. మరి మిగతా రాష్ట్రాల్లో ఎందుకు ఇలా జరగలేదని ప్ర‌శ్నించారు. దేశాన్ని బ్రష్టు పట్టించే పనులు చేస్తున్నదని విమ‌ర్శించారు. బెంగుళూరు సిలికాన్ వ్యాలీలా తయారైంది. 30 లక్షల మంది ఐటీ ఉద్యోగులున్నరు. మరో 30 లక్షల మంది పరోక్షంగా బతుకుతరు. ఆ రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా నిర్ణయాలు తీసుకుంటరని అన్నారు.

దేశం చిన్నాభిన్నం అయితే, నిరుద్యోగులందరినీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పోషిస్తదా? అని నిల‌దీశారు. మత విద్వేషాలతో దేశం అతి భారీ మూల్యం చెల్లించక తప్పదని అన్నారు. ఈ ఉన్మాదుల చేతిలో పడి దేశ యువత, మేధావులు కొట్టుకొని పోతే, దేశం 100 ఏళ్లు వెనక్కి పోతదని అన్నారు. ప్రజలు ఈ ఉన్మాదుల కుటిల యత్నాలను అర్ధం చేసుకొని, తిప్పికొట్టాలని.. బుద్ధిజీవులైన భారత ప్రజలు తప్పక తిప్పికొడతారని.. ఇష్టం వచ్చినట్లు నడిపించలేరు. హిట్లర్లు, ముస్సోలినీలే పోయిండ్లు మీరెంత? అని వ్యాఖ్యానించారు.

కేంద్రంపై పోరాటంలో నేను ముందుంట. అందరినీ ఒకటి చేస్తా. దేశ రైతాంగానికి దిక్కూ, దివాణం లేరనుకోకండి.. జాగ్రత్త అని హెచ్చరించారు. భారత దేశంలో రైతులకు రాజ్యాంగపరమైన రక్షణ నిస్తూ, ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ పాలసీ రావాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయం వ్య‌క్తం చేశారు. త్వరలోనే హైదరాబాదులో ఈ పాలసీని తయారు చేస్తం అని అన్నారు. కేంద్రం ఈ పాలసీని అడాప్ట్ చేసుకుంటే సరి.. లేదంటే, కేంద్రంలో ఇలాంటి పాలసీని తెచ్చే ప్రభుత్వాన్నే తెచ్చుకుంటం అని అన్నారు.










































Next Story