ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి : సీఎం కేసీఆర్‌

CM KCR asks Govt machinery to be on high alert. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) నివేదికల ప్రకారం రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలో

By Medi Samrat  Published on  23 July 2022 1:33 PM GMT
ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి : సీఎం కేసీఆర్‌

భారత వాతావరణ శాఖ (ఐఎండీ) నివేదికల ప్రకారం రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శనివారం ఆదేశించారు. దీని ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సీనియర్ అధికారులు, జిల్లా కలెక్టర్లతో చీఫ్ సెక్రటరీ టెలికాన్ఫరెన్స్ నిర్వహించి వారికి వివరించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని ఆయన కోరారు.

జిల్లాలోని అధికారులందరూ హెడ్ క్వార్టర్స్‌లో అందుబాటులో ఉండేలా చూడాలని, సెలవులకు అనుమతి ఇవ్వరాదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కలెక్టర్లను కోరారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి సహాయక శిబిరాలను సిద్ధంగా ఉంచాలన్నారు. కలెక్టర్లు సంబంధిత అన్ని శాఖల సమన్వయంతో పనిచేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించారు.

"వాతావ‌ర‌ణ శాఖ‌ భారీ వర్షపాతాన్ని అంచనా వేసింది. రేపు మధ్యాహ్నం నుండి దాని ప్రభావం కనిపిస్తుంది. నీటిపారుదల ట్యాంకులు, రోడ్లు, కాజ్‌వేలు కూడా మునిగిపోయే అవకాశం ఉంది, "అని ఆయన అన్నారు. ట్యాంకులు, చెరువులు, రిజర్వాయర్‌లు పొంగిపొర్లుతున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించారు. ఈ టెలికాన్ఫరెన్స్‌లో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Next Story